లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంబీబీఎస్ పట్టా పొంది, ఆ తర్వాత భారత పరిపాలనా సేవ(ఐఏఎస్) చేసి.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. లోక్సత్తా అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వతా దాన్ని రాజకీయ పార్టీగా మార్చి.. 2009తో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టీవ్గా లేరు. ఈ క్రమంలో జయప్రకాష్ నారాయణకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. లోక్సత్తా పార్టీ ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ నుంచి లోక్సత్తా పార్టీ తరఫున జయప్రకాష్ నారాయణ పోటీ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానించింది.
పెండింగ్లో ఉన్న ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించేందుకు జయప్రకాష్ నారాయణ.. ఏపీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో నిర్ణయించారు. ఎంపీగా పోటీ చేస్తారని లోక్సత్తా రాష్ట్ర కమిటీ వెల్లడించింది. ఈ క్రమంలో 2024 ఎన్నికలు వచ్చేసరికి.. లోక్సత్తా పార్టీని బలోపేతం చేయడం, కార్యాచరణ వంటి వాటిపై చర్చించేందుకు విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జేపీతో పాటు, పలువురు పార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ నారాయణతో కలిసివచ్చే వారితో నూతన రాజకీయ వేదిక నిర్మాణం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అలానే 2024 ఎన్నికల్లో ఆయన ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని నిర్ణయం తీసుకున్నారు.