గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు మొదలయ్యాయి. సమవేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈసందర్భంగా మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాల వికేంద్రీకరణ జరగాలనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని అన్నారు. ఈక్రమంలోనే నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు రాఘవేంద్రరావుపై కూడా కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
పరిపాల వికేంద్రీకరణపై అసెంబ్లీలో కొడాలి నాని మాట్లాడుతూ..” సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురద చల్లడమే పనిగా కొందరు పెట్టుకున్నారు. వాళ్లుకు రాష్టం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం లేదు. చంద్రబాబు బినామీలు దళితులను భయపెట్టి అసైన్డ్ భూములను లాక్కున్నారు. అశ్వనీదత్, రాఘవేంద్రరావు, శ్రీధర్, కె.వి. రావు వంటి మరికొందరికి కోరుకున్న చోట అమరావతి ప్రాంతంలో భూములిచ్చారు. ఇంకా తనకు కావాల్సిన వారికి తక్కువ ధరలకే భూములు కట్టబెట్టారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. అమరావతిని భ్రమరావతిని చేసింది చంద్రబాబు కాదా?. టీడీపీ నేతలకు రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు.. వారి స్వార్ధ ప్రయోజనాలే వారికి కావాలి.
దుర్మార్గులంతా కలిసి రోడ్లపైకి వచ్చారు. వారు చేసే పాదయాత్ర రాజధాని కోసమా? చంద్రబాబు, లోకేష్ ల కోసమా?. అమరావతి గురించి రేణుకా చౌదరి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఖమ్మంలో కార్పోరేటర్ గా గెలవలేని రేణకా చౌదరి అమరావతి గురించి మాట్లాడటమా?. చంద్రబాబు 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు. ఇప్పుడు దేవుడి గురించి మాడ్లాడుతున్నాడు” అంటూ అసెంబ్లీ వేదికగా కొడాలి నాని నిప్పులు చెరిగారు. మరి.. నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.