మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఎం జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆరు నెలల్లోగా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది అయితే ఆ గడువు లోగా అది సాధ్యమా కాదా అన్న సంగతి పక్కన పెడితే, మూడు రాజధానుల నిర్ణయానికి పులిస్టాప్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు ఆదేశాలపై విపక్ష నేతలు, అమరావతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో శివాజీ హైకోర్టు తీర్పుపై స్పందించాడు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని తాను చెబుతూ వస్తున్నానని.. వ్యాపారులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. అంతేకాక వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలతో టచ్లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు శివాజీ.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కష్టాల్లో ఉందని.. జగన్ సర్కార్ ఇప్పటికైనా మనసు మార్చుకోవాలన్నారు శివాజీ. అమరావతి రాష్ట్ర భవిష్యత్కు చాలా ముఖ్యమని.. సీఎం జగన్ దీన్ని గమనించాలని సూచించారు. అంతేకాక రాష్ట్రం అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని.. అన్యాయంపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజా వేదికను కూల్చిన రోజే ప్రజలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లాలనే జగన్ ఇదంతా చేశారని.. ఫిబ్రవరి, మార్చిలోనే మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లడానికే ఇదంతా చేశారని వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమ స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా ఉద్యమానికి ముఖ్యమంత్రి జగన్ జవాబుదారీ అన్నారు శివాజీ. హోదా ముగిసిన అధ్యయం కాదు.. ఏపీ ప్రజల హక్కన్నారు. కేంద్రం సంగతి పక్కన పెడితే ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జనసేన పార్టీ, టీడీపీలకు రాష్ట్ర భవిష్యత్ గురించి పట్టదా అంటూ ప్రశ్నించారు. ప్రతిసారి కోర్టుల్లో కుదరదు.. ప్రజలు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను ప్రశ్నించాలన్నారు. శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.