హైదరాబాద్- గ్రేటర్ హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలో, అదీ నడిరోడ్డుపై ఒంటరి మహిళను ఓ దుండగుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. మహిళను నడిరోడ్డుపై కత్తితో పొడవడంతో జనం భయంతో పరుగులు తీశారు.
ఈ భయంకరమైన ఘటన నగరంలోని ఎర్రగడ్డలో జరిగింది. కొంత కాలంగా భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళపై ఖలీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నడి రోడ్డుపై విచక్షణా రహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ హత్యను ప్రత్యక్ష్యంగా చూసిన జనం భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా ఎర్రగడ్డ రోడ్డులో భయానకరమైన వాతావారణం నెలకొంది.
నడిరోడ్డుపై హత్య సమాచారం తెలుసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సదరు మహిళను సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలి వివరాలతో పాటు ఆమె హత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు.