హైదరాబాద్- ఈ మధ్య కాలంలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నుంచి మొదలు, అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నా.. చాలా మంది జాగ్రత్తగా ఉండటం లేదు. ఇదిగో ఇలా అజాగ్రత్త వల్ల హైదరాబాద్ లో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీ నాలుగో ఫేజ్ ఆర్టీఐ కార్యాలయం వెనక ఓ క్వారీ గుంత ఉంది. దాని సమీపంలో ఆడుకోవడానికి వెళ్లి ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయారు. గుంత మొత్తం నీటితో నిండి ఉండటంతో మృతదేహాలను వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎప్ బృందం, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.
క్వారీ గుంతలో పడిన ముగ్గురు బాలికల్లో ఇద్దరి మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందం వెలికి తీసింది. మరొకరి మృతదేహం కోసం ఇంకా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్న సంగీత (12), రమ్య(7), సోఫియాలు (12) క్వారీ గుంత వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాద వశాత్తు ముగ్గురు కాలు జారి క్వారీ గుంతలో పడిపోయారు.
దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకున్న కేపీహెచ్బీ పోలీసులు, క్వారీ గుంత లోతుగా ఉండటంతో గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ముగ్గురు బాలికలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టగా, ఇద్దరు బాలికల మృతదేహాలను వెలికి తీశారు. మరో బాలిక మృత దేహం కోసం గాలిస్తున్నారు.