ముంబయి- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు ఊరనిచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానాలను మరో ఆరు నెలలపాటు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.
సీఓఎఫ్- కార్డ్ ఆన్ ఫైల్ డేటా ను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో నూతన టోకెనైజేషన్ పాలసీ 1 జూలై 2022 నుంచి మొదలవ్వనుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టనుంది.
వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఆయా బ్యాంకులు మర్చంట్ వెబ్ సైట్ లేదా ఆయా యాప్ లలో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేసే విషయంలో ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. ఐతే ప్రస్తుతం ఆర్బీఐ డెబిట్, క్రెడిట్ కార్టుల టోకనైజేషన్ విధానాన్ని వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు ఊరట లభించింది.
టోకనైజేషన్ విధానాలతో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్లైన్ కొనుగోళ్లను అనుమతిస్తుంది. దీని వల్ల వినియోగదారుల లావాదేవీలు మరింత సురక్షితం అవ్వడంతో పాటు, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ఉంటారని ఆర్బీఐ చెబుతోంది. కొత్త టోకెనైజేషన్ పాలసీ 1 జూలై 2022 నుంచి అమల్లోకి రానుంది.