న్యూఢిల్లీ- అసెంబ్లీలో, పార్లమెంట్ లో కొట్టుకోవడం తిట్టుకోవడం మనం సాధరణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటన నిజంగా జరిగిందని అంటున్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు. అవును సాక్షాత్తు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తనను సహచర వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాదు ఏకంగా లోక్ సభ స్పీకర్ కు పిర్యాదు కూడా చేశారు.
సహచర ఎంపీల ముందు ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తనను అసభ్యంగా, నీచంగా మాట్లాడటంతో పాటు హెచ్చరించారని ఎంపీ రఘురామ ఆరోపించారు. మాధవ్ తనతో మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు. ఇతర ఎంపీలు ఉండటంతో తాను సంయమనం పాటించానని, ఆ తరువాత స్పీకర్ ఓం బిర్లాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.
ఎంపీ గోరంట్ర మాధవ్ తనతో ఎలాంటి హవభావాలు వ్యక్తం చేశారో సెంట్రల్ హాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో విజువల్స్ ఉన్నాయని, వాటిని పరిశీలించాలని స్పీకర్ ను కోరారు. సీసీ కెమెరాల్లో ఎంపీ మాధవ్ ఏమన్నారో వినిపించకపోయినా, ఆయన బాడీ లాంగ్వేజ్ అర్థం అవుతుందని చెప్పారు.సీఎం జగన్ ఎంపీ మాధవ్ తో ఈ విధంగా మాట్లాడించారా, లేక ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకొనే క్రమంలో మాధవ్ ఇలా మాట్లాడారో తెలియడంలేదని రఘురామకృష్ణరాజు అన్నారు.
తన పిర్యాదుపై స్పీకర్ స్పందిస్తారన్న నమ్మకం ఉందన్న రఘురామ, ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఐతే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రం స్పందించ లేదు. దీంతో ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడీ అంశం ఆసక్తికరంగా మారింది.