ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రస్తుతం ఒకే కుటుంబం రకరకాల పింఛన్లను పొందవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ విధానానికి త్వరలో చెక్ పెట్టబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా మళ్లీ అదే అంశం తెరపైకి వచ్చింది. గతేడాది మే నెలలో ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొనడంతో వెనక్కి తగ్గింది. కానీ ప్రస్తుతం ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ సర్కార్ – ఒకే రేషన్ కార్డుపై ఒకటికి మించిన పింఛన్లు ఉంటే వాటిని తొలగించేందుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ సారి కచ్చితమేనన్న సంకేతాలు కనబడుతున్నాయి. ఈ మేరకు లబ్దిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. వీటిపై సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం పింఛన్ల కోత తప్పదంటోంది. దీంతో రేషన్ కార్డు దారులతో పాటు పింఛన్ దారులూ బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్ విషయంలో తీసుకునే నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాను పొదుపు చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అసలే కరోనా సమయం, తగినన్ని ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు దారులు పిల్లలతో కలిసి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇందులో ఏ తేడా వచ్చినా ఇకపై రేషన్ అందదన్న భయం వారిలో కనిపిస్తోంది