చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తమతో పాటు లగేజ్ తీసుకెళ్తూ ఉంటారు. అయితే లగేజ్ విషయంలో ఇన్ని కిలోల వరకూ ఒక మనిషికి అనుమతి ఉంటుంది. అది కూడా ఇన్ని కిలోల బరువు వరకూ లగేజ్ ఛార్జీలు ఉండవు. ఉచిత ఛార్జీలకు తగ్గట్టు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే ఆయా ఆర్టీసీ సంస్థల నిబంధనల ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో ఒక ల్యాప్ టాప్ తీసుకెళ్ళినందుకు ఒక కండక్టర్ 10 రూపాయల ఛార్జీ వసూలు చేశాడన్న వార్త బాగా వైరల్ అయ్యింది. కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ నిబంధనల ప్రకారం 30 కిలోల వరకూ ఎటువంటి ఛార్జీలు లేకుండా తీసుకెళ్లవచ్చు. 30 కిలోలు దాటితే మాత్రం దూరాన్ని బట్టి లగేజ్ ఛార్జీలు ఉంటాయి.
అయితే ప్రయాణికుడు ఎంత వాదించినా రూల్స్ మారాయని సదరు కండక్టర్ 10 రూపాయల లగేజ్ ఛార్జ్ వేశాడు. అది కూడా పట్టుమని ఒక కిలో ఉండే ల్యాప్ టాప్ కి. అదేమైనా పెద్ద లగేజా? అసలు ల్యాప్ టాప్ కి ఛార్జీలు ఏమిటో? ఇలాంటి ఘటనే మన తెలంగాణలో కూడా చోటు చేసుకుంది. శ్రీకాంత్ రావు అనే వ్యక్తి 25 కిలోల లగేజ్ తో అక్టోబర్ 27న జూబ్లీహిల్స్ నుంచి వేములవాడ ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేశారు. జూబ్లీహిల్స్ నుంచి వేములవాడ దూరం 145 కిలోమీటర్లు. 25 కిలోల లగేజ్ కి కండక్టర్ ఛార్జ్ చేసిన రుసుము 70 రూపాయలు. అదేంటి 50 కిలోల వరకూ ఉచితమే కదా అని గొడవ పెట్టుకున్నా.. సమస్యే లేదు రూల్స్ మారాయని సదరు కండక్టర్ 70 రూ/- వసూలు చేశారు సదరు కండక్టర్. సమస్య ఎక్కడుంది? 50 కిలోల వరకూ ఉచితం అని చెప్తున్నారు. మరి 25 కిలోలకి ఛార్జీలు ఎందుకు అనేది ప్రశ్న?
@tsrtcmdoffice @TSRTCHQ @rm_krmr
Hi sir,
I have Carried 25 KGS along with https://t.co/dyQL2fEbeI of your bus conductor charged 70rupees luggage charges.I don’t know when TSRTC implement this.Already charges are increased multiple times.kindly do the need full. pic.twitter.com/EIn9kDOewj
— @srikanth rao@ (@srikanthraod) October 27, 2022
ఏంటి ఈ 10 రూపాయలకి, 70 రూపాయలకి కొంపలు మునిగిపోతాయా? అని అనుకోవడానికి లేదు. కర్ణాటకలో 10 రూపాయలు వసూలు చేసినా, తెలంగాణలో 70 రూపాయలు వసూలు చేసినా అది అన్యాయంగా వసూలు చేయబడినదిగా పరిగణించాలి. అన్యాయాన్ని ఎందుకు సహించాలి అనేది ఇక్కడ సామాన్యుల ఆవేదన. మనకి ఉన్న హక్కులను తెలుసుకోవడం తప్పు కాదు కదా. ఇక్కడ 10 రూపాయల గురించో, 70 రూపాయల గురించో జరుగుతున్న యుద్ధం కాదు. అన్యాయానికి, అమాయకత్వానికి జరుగుతున్న పోరాటం. అమాయకంగా ఉంటే ఇలానే దోచేస్తారు. ‘మనది కానిది ఒక్క రూపాయి మనకి వద్దు, మనది అనుకున్న రూపాయి అస్సలు వదులుకోవద్దు’ అనుకునే వారు ఉంటే గనుక పోరాడడంలో తప్పు లేదు.
మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఒక మనిషికి 50 కిలోల వరకూ లగేజీకి ఎటువంటి ఛార్జీలు లేవు. అది కమర్షియల్ వస్తువులైనా, నాన్ కమర్షియల్ వస్తువులైనా సరే ఉచితంగా 50 కిలోల వరకూ అనుమతి ఉంది. మామూలుగా ఒక మనిషి 100 కిలోల వరకూ బరువున్న లగేజ్ ని తీసుకెళ్లవచ్చు. ఉచితంగా మాత్రం 50కిలోల లోపు లగేజ్ తీసుకెళ్లవచ్చు. ఆపై బరువు ఉంటే కొన్ని నిబంధనల మేరకు ఛార్జీలు వర్తిస్తాయి. 50 కిలోల లగేజీని కూడా 3 ప్యాకెట్లకు మించి ఉండకుండా చూసుకోవాలి. అది కూడా ఒక్కొక్కటి 20 కిలోల బరువు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఛార్జీలు తప్పవు. ప్రయాణం చేసే దూరాన్ని బట్టి లగేజ్ ఛార్జీలు ఉంటాయి.