తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం
చెన్నై- తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. అచ్చ తమిళంలో స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత స్టాలిన్ గవర్నర్ భన్వరిలాల్ ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించారు. ఇక స్టాలిన్ తో పాటు మరో 34 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 34 మందిలో ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు స్టాలిన్. కరోనా నేపధ్యంలో పరిమిత సంఖ్యలోనే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. స్టాలిన్ ప్రమాణం చేస్తుండగా ఆయన సతీమణి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు.
స్టాలిన్ కేబినెట్లో చోటు దక్కంచుకున్న 34 మందిలో గతంలో డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారితోపాటూ, కొత్త వారు ఉన్నారు. దురైమురుగన్, కెఎన్. నెహ్రూ, ఐ. పెరియస్వామి, పొన్ముడి, వేలు, ఎంఆర్కే పన్నీర్సెల్వం, కేకేఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు, రఘుపతి, ముత్తుస్వామి, పెరయకుప్పన్, టీఎం. అన్బరసన్, ఎంపీ స్వామినాథన్, గీతా జీవన్, అనితా రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, కె. రామచంద్రన్, చక్రపాణి, వి. సెంథిల్ బాలాజీ, ఆర్. గాంధీ, ఎం సుబ్రమణియన్, పి. మూర్తి, ఎస్ఎస్ శివశంకర్, పీకె. శేఖర్బాబు, పళనివేల్ త్యాగరాజన్, ఎస్ఎం. నాజర్, సెంజి కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎస్వీ గణేశన్, మనో తంగరాజ్, మదివేందన్, కయల్విళి సెల్వరాజ్ కు క్యాబినెట్ లో స్ఠానం కల్పించారు స్టాలిన్.