Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పేరు చెప్పగానే చాలామంది.. అతడా! ఓ రాక్షసుడు.. అనేస్తారు వెంటనే. మానవత్వం చూపని నైజం, కనికరంలేని మనసు అతడ్ని ప్రపంచంలోనే కఠినాత్ముడైన అధ్యక్షుడిగా నిలబెట్టాయి. తనకు అడ్డువచ్చిన వారిని ఎవ్వరినీ అతడు వదలడు అన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. అయితే, అతడికీ మనసు ఉందని నిరూపితమైంది. అయితే, అది అందరి విషయంలో స్పందించకపోయినా కొంతమంది విషయంలో మాత్రం గట్టిగానే స్పందిస్తుందని ప్రపంచానికి తెలిసింది. ఇందుకు ఓ పాత వీడియో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఆ వీడియోలో.. ప్రపంచం అంతా రాక్షసుడు అని పిలుస్తున్న కిమ్ తన మిత్రుడి కోసం చాలా బాధపడ్డారు.
ఎంతలా అంటే మిత్రుడు అంత్యక్రియల్ని అన్నీ తానై చూసుకున్నాడు. ఆఖరికి స్వయంగా శవ పేటికను మోశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర కొరియా ఉన్నత సైనికాధికారి, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆప్తమిత్రుడు హ్యోన్ చోల్ హాయ్ గత మే నెలలో మరణించాడు. హ్యోన్ కిమ్కు ఎన్నో విషయాల్లో తోడుగా నిలిచాడు. తండ్రి మరణం తర్వాత కిమ్ బాధ్యతలు చేపట్టడంలో ఆయనే కీలక పాత్ర పోషించాడు. 2011లో కిమ్ జాంగ్ 2 మరణానికి ముందు నుంచే కిమ్ జాంగ్ ఉన్ను అధ్యక్ష పదవి కోసం సిద్ధం చేస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తి మరణంతో కిమ్ చలించిపోయాడు. అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాడు.
స్వయంగా హ్యోన్ శవ పేటికను మోశాడు. శవ పేటికను పూడ్చే సందర్భంలో కూడా తన మనసును బయట పెట్టాడు కిమ్. పక్కనున్న వాళ్లు మట్టి వేయటానికి కిమ్ చేతికి పారను ఇచ్చారు. అయితే, కిమ్ దాన్ని తీసుకుని ఆలోచించాడు. ఆ వెంటనే వెనక్కు ఇచ్చేశాడు. తన చేతులతో కింద కూడ్చుని ఆప్తమిత్రుడిపై శవ పేటికపై మట్టి చల్లి, వీడ్కోలు చెప్పాడు. ఈ కార్యక్రమం అయిపోయే వరకు అతడు చాలా బాధలో ఉన్నట్లు అతడి ముఖమే చెబుతోంది. ప్రస్తుతం హ్యోన్ అంత్యక్రియల్లో కిమ్ ప్రవర్తనకు సంబంధించిన ఆ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. కిమ్కు కూడా మనసుందంటూ కామెంట్లు చేస్తున్నారు.