సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఐపీఎల్ 14వ సీజన్ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే క్రికెటర్లు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్, టీమ్ కోచింగ్ స్టాఫ్స్, కామెంటేటర్లు, మ్యాచ్ అధికారులు, ట్రావెల్ సిబ్బందిని ఏడు రోజులు క్వారంటైన్లో ఉంచి మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షల తర్వాత బయో- సెక్యూర్ బబుల్లోకి చేర్చారు. ఒక్కసారి ఈ బబుల్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బబుల్లో లేని వ్యక్తితో పర్సనల్గా కాంటాక్ట్ అవడానికి అనుమతించరు. ఈ నిబంధనని కఠినంగా అమలు చేయడంతో ముంబయి, చెన్నైలోమ్యాచ్ల్ని నిర్వహించినా బబుల్లోని ఎవరూ కరోనా వైరస్ బారినపడలేదు. కానీ గంటల వ్యవధిలోనే వరుసగా టీమ్లలో కరోనా కేసులు నమోదవడంతో ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందు టోర్నీని వాయిదా వేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకపోయింది.
మొదట కోల్కతా నైట్రైడర్స్ టీమ్లో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడటంతో సోమవారం జరగాల్సిన కోల్కతా, బెంగళూరు మ్యాచ్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం సన్రైజర్స్ టీమ్లో వృద్ధిమాన్ సాహా కూడా కొవిడ్ బారిన పడినట్లు తేలింది. మొదట లీగ్లో మిగిలిన మ్యాచ్లను ముంబైలోనే నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చినా తాజాగా సాహా, అమిత్ మిశ్రాలు కూడా కరోనా బారిన పడ్డారని తేలడంతో ఐపీఎల్ 14వ సీజన్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
ఏప్రిల్ 9న ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమవగా మే 2 వరకూ 29 మ్యాచ్లను బీసీసీఐ దిగ్విజయంగా నిర్వహించగలిగింది. ఈ సీజన్ కూడా యూఏఈలో నిర్వహించాలని మొదట ప్రతిపాదన వచ్చినా బీసీసీఐ మాత్రం ఇక్కడే నిర్వహించడానికి మొగ్గు చూపింది. ఇప్పుడు కరోనా కారణంగా ఐపీఎల్నే వాయిదా వేయడంతో అక్టోబర్లో జరగాల్సిన టీ20 వరల్డ్కప్పైనా నీలి నీడలు కమ్ముకున్నాయి.