ఆపత్సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పి, వెన్నుదన్నుగా నిలవాల్సిన అధ్యక్షుడు ఘనీ ‘తోక ముడిచారనీ . తనకు కావలసినంత మేర డబ్బు సంచుల్లో కూరుకుని ఆయన పలాయన మంత్రం పఠించార’నీ వార్తలొచ్చాయి. సోషల్ మీడియా ఈ వార్తలు వైరలూ అయ్యాయి. హెలికాప్టర్ లో పట్టినంత మేర డబ్బు కుక్కుకుని మిగిలిన నోట్ల కట్టలను రన్ వే పైనే పడేసి ఆయన ఉడాయించారనీ – ఆయన హెలికాప్టర్ ఎటువైపు ప్రయాణించినదీ కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారనీ అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం అష్రాఫ్ ఘనీ అబుదాబీలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజల సొమ్మును లూటీ చేసి తీసుకుపోయిన ఘనీని డిటైన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన ఘని, ఒక వీడియో రిలీజ్ చేసారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్న ఘని, దేశం విడిచి రావడానికి కారణాలను వివరించారు.
అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాబూల్ నుంచి పారిపోయిన తర్వాత మొదటిసారి చేసిన వీడియోలో తాను తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు అలా చేయాల్సివచ్చిందని వివరణ ఇచ్చారు. సంప్రదాయ బట్టలు, ఒక చొక్కా, చెప్పులతోనే అఫ్ఘానిస్థాన్ ను విడిచి వెళ్లాల్సివచ్చిందని అష్రఫ్ ఘనీ సందేశంలో చెప్పారు.
‘డబ్బుతో పారిపోయాననేది అబద్ధం, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ కి వస్తాన’ని చెప్పారు. దేశంలో రక్తపాతాన్ని నివారించడానికి ఏకైకమార్గంగా తాను కాబూల్ నుంచి పారిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఘనీ సమర్థించుకున్నారు. అఫ్ఘాన్ భద్రతా దళాలకు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి మంత్రం తాలిబాన్లు అధికారాన్ని లాక్కోవడానికి దారితీసిందని ఆయన చెప్పారు.