ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా పుష్పతో పాటు, గత సినిమా అల వైకుంఠపురము సినిమాలో ప్రముఖ గాయకుడు సిధ్ శ్రీరామ్ పాటలు పాడారు, ఈ రెండు చిత్రాల్లో ఆయన పాడిన పాటలు ఎంత సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ ఐతే వయసుతో సంబందం లేకుండా అందరికి తెగ నచ్చేసింది.
సింగర్ సిధ్ శ్రీరామ్ గురించి ఇప్పటి వరకు ప్రత్యేకంగా ప్రస్తావించని అల్లు అర్జున్, తాజాగా సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. సిధ్ శ్రీరామ్ గాత్రానికి సంగీతంతో పనిలేదని, ఆయనే ఓ సంగీతమంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. ఇప్పుడు ఈ లేఖ బాగా వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ సిధ్ శ్రీరామ్ గురించి ఏమన్నారంటే.. కాస్త తీరిగ్గా ఉన్నప్పుడు ఇది చెప్పాలనుకున్నాను.. పుష్ప ప్రీ రిలీజ్ వేడుకలో నా సోదరుడు సిధ్ శ్రీరామ్..శ్రీవల్లి పాటను పాడారు. ఎటువంటి సంగీత వాయిద్యాలు లేకుండా అతను పాటను స్టార్ట్ చేశారు. నేనింకా నిదానంగా అతని పాటకి వెనుక సంగీతం మొదలు పెడతారేమో అని వేచిచూస్తున్నా. కాని.., సంగీతం ప్రారంభం కాలేదు. ఎటువంటి సంగీతం లేకుండా.. పాటను పాడుతూనే ఉన్నారు. ఆశ్చర్యపోయా. నాకది అద్భుతంగా అనిపించింది. అతనికి సంగీతంతో పనిలేదు.. అతనే సంగీతం.. అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
ఇక అల్లు అర్జున్ తన గురించి సోషల్ మీడియా ద్వార పోస్ట్ చేసిన లేఖపై సిధ్ శ్రీరామ్ స్పందించారు. ఇది నిజమైన గౌరవంగా భావిస్తున్నానని అల్లు అర్జున్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇంకా మరెన్నో మంచి పాటలు తన కోసం పాడేందుకు వేచిచూస్తున్నానని చెలిపారు సిధ్ శ్రీరామ్.