ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రముఖ నిర్మాత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషాదాలతో సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జక్కుల నాగేశ్వరరావు (46) ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో ఈ దుర్ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది.
‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ చిత్రాలకు నిర్మాత గా వ్యవహరించారు. ఆయన మరణ వార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత నాగేశ్వరరావుకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిర్మాత మృతికి సినీ నటీనటులు, దర్శక-నిర్మాతలు సంతాపం తెలుపుతున్నారు.