ఒకప్పుడు దక్షిణాది సినిమాలు అంటే చిన్నచూపు చూసేవారు, అప్పట్లో అలా ఉండేది కూడా. దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి వల్ల ఆ మార్క్ చెరిగిపోయింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండ్ కూడా మారింది. భారీ బడ్జెట్ తో యాక్షన్, పీరియాడికల్ మూవీస్ తీశారు, తీస్తున్నారు. అలా వచ్చిన వాటిలో త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ 2 లాంటి చిత్రాలు..బాక్సాఫీస్ దగ్గర బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. ఇప్పుడు అలా బాక్సాఫీస్ వండర్ క్రియేట్ చేసేందుకు వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. దీని ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేయగా, అది వావ్ అనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. పదో శతాబ్దంలో చోళ సామ్రజ్యంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ‘పొన్నియన్ సెల్వన్-1’ చిత్రం. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. “వెయ్యి సంవత్సరాల క్రితం చోళ నాట స్వర్ణ శకం ఉదయించక మునుపు… ఒక తోక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ రాజకులంలో ఒకరిని ఆ తోక చుక బలి కోరుతుందని అంటున్నారు. దేశాన్ని పగలు, ప్రతీకారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. వంచన, ద్రోహం రాజ మందిరంలోకి చొచ్చుకుని పోతున్నాయి” అని హీరో రానా వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, చోళ రాజ్యరక్షకుడిగా జయం రవి కనిపించారు. వీళ్లతో పాటు కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్, పార్దిబన్ తదితరులు.. ఒక్కొక్కరు స్క్రీన్ పై కనిపిస్తుంటే అదే రీతిలో విజువల్స్ కూడా గ్రాండ్ గా అనిపించాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాని మరో స్థాయిలో నిలబెట్టేలా కనిపిస్తోంది. సెప్టెంబరు 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. మరి పీరియాడికల్ మూవీ అనగానే మనకు బాహుబలినే గుర్తొస్తుంది. అలాంటి సినిమాని పొన్నియన్ సెల్వన్ మరిపిస్తుందా అనేదా చూడాలి. ఈ చిత్ర ట్రైలర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: రాజమౌళి ప్రమోట్ చేస్తున్న ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ఫస్ట్ రివ్యూ!