తెలుగు చలన చిత్రసీమలో తనదైన ముద్రవేసి, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ.. అనారోగ్య సమస్యలతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ స్టార్ హీరోల దగ్గర నుంచి నటీనటులు, సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. ఆయన సినిమాల్ని గుర్తుచేసుకుంటా సోషల్ మీడియాలో నివాళి అర్పిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కృష్ణ సేవల్న గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం.. తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు. కృష్ణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్పత్రిలో కృష్ణ మరణించిన తర్వాత పార్థివ దేహాన్ని కృష్ణ ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కథానాయకుల దగ్గర నుంచి సాధారణ నటీనటుల వరకు అందరూ వచ్చి నివాళి అర్పిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చి, కృష్ణకి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు కృష్ణ కుమారుడు మహేశ్ తో మాట్లాడారు. ఇక అంతకు ముందు తన ట్వీట్ లో కృష్ణ గురించి ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు. ‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీకృష్ణగారు తుదిశ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణగారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’
‘స్నేహశీలి, మృదుస్వభావి అయిన ఆయన ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాసులో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో ఆయనకి చక్కటి అనుబంధం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా తనదైన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణగారి మరణం తెలుగు చలన చిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పవన్ రాసుకొచ్చారు.