టాలీవుడ్ లో సంచలనం రేపుతున్న హీరో సాయి తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే గోల్డెన్ అవర్లో అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం, ఆ టైమ్లో ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే సాయి తేజ్ ప్రాణాలతో బయటపడ్డారని అంటున్నారు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యులు. 108 సిబ్బంది సమయానికి అతన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు.
బైక్ మీద నుంచి కింద పడిన వెంటనే తేజ్ కు ఫిట్స్ వచ్చాయని… 108 సిబ్బంది తమ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే తేజ్ అపస్మారక స్థితిలో ఉన్నారని మెడికవర్ వైద్యులు చెప్పారు. అయితే రెండో సారి ఫిట్స్ రాకుండ తాము చికిత్స చేశామని తెలిపారు. ఆ తర్వాత బ్రెయిన్, షోల్డర్, స్పైనల్ కార్డ్, అబ్ డామిన్, చెస్ట్ స్కానింగ్ లు చేశామని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వల్ల… ఆయనకు కృత్రిమ శ్వాస పెట్టామని చెప్పారు.
అదృష్టం కొద్ది అతడు హెల్మెట్ ధరించడం వల్ల హెడ్ ఇంజూరీస్ కాలేదన్నారు మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ సతీష్. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.