ఇండస్ట్రీలో ఒక తరం హీరోల తర్వాత వారి ప్రస్థానాన్ని వారసులు కొనసాగించడం అనేది ఎప్పటినుండో జరుగుతూ వస్తోంది. అలా టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా కంటిన్యూ అవుతున్నాడు ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు. చిన్నతనం నుండే సినిమాలలో నటించడం మొదలుపెట్టిన విష్ణు.. హీరోగా మారాక మంచి హిట్స్ కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. కెరీర్ లో ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి హిట్స్ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు విష్ణు. ఇటీవలే హారర్ కామెడీ జానర్ లో ‘జిన్నా’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సినిమాలో విష్ణు సరసన సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ గా నటించగా.. డెబ్యూ డైరెక్టర్ సూర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక హీరోగా నటిస్తూనే మంచు విష్ణు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. అయితే.. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన జిన్నా మూవీ.. బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ తెచుకున్నప్పటికీ, కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. మొదటి నుండి నటనపై ఆసక్తి ఉందని.. తనకు తండ్రి మోహన్ బాబు డిక్షన్ రాకపోవడం మైనస్ అని చెప్పాడు.
మంచు విష్ణు ఇంకా మాట్లాడుతూ.. “నాన్నగారి వారసులుగా వచ్చామని మమ్మల్ని ఆయనతో పోల్చుతుంటారు. కానీ.. మేమెప్పుడూ ఆయనకంటే తక్కువలోనే ఉంటాం. నాన్నగారు చేసిన విభిన్నమైన క్యారెక్టర్స్ లో నేను కొన్ని కూడా చేయలేదు. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. ఆయన చూసిన సూపర్ హిట్స్ నేను ఇంకా చూడలేదు. నా సినిమాలలో దేనికైనా రెడీ, దూసుకెళ్తా.. ఇలాంటి రెండు మూడు సినిమాలే 30, 40 కోట్ల వరకూ రాబట్టాయి. కానీ.. నాన్నగారి కెరీర్ లో ఎనిమిది, తొమ్మిది ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఆ సినిమాలు, పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అయితే.. నాన్నగారి ‘కలెక్షన్ కింగ్’ బిరుదు పొందడానికి నేనింకా అర్హుడిని కాదు. ఫ్యూచర్ లో వస్తుందేమో చూడాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.