మహేష్ బాబు.. తెలుగు తెర మీద సూపర్ స్టార్. మరి నిజ జీవితంలో.. చాలా గొప్ప మనిషి.. జాలి గుణం మెండుగా ఉన్న వ్యక్తి. సూపర్స్టార్గా తాను అనుభవిస్తున్న ఈ జీవితం ప్రజలు ఇచ్చిందే అని నమ్ముతాడు. అందుకే తన శక్తి మేరకు సమాజానికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. పది రూపాయలు ఇచ్చి.. వంద రూపాయల ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో.. మహేష్ బాబు మాత్రం.. ఎడమ చేత్తో చేసిన దానాన్ని కుడి చేతికి తెలియనివ్వలేదు. అయితే బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అన్స్టాపబుల్ షో ద్వారా.. మహేష్ బాబు చేస్తున్న సమాజ సేవ గురించి ప్రపంచానికి తెలిసిందే. అప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ మీద అందమైన హీరోగా ఆయనను అభిమానించిన వాళ్లు.. అందమైన మనసు ఉందని తెలుసుకుని ఎంతో సంతోషించారు. మహేష్ బాబు అభిమానులమని ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. అవును మరి ప్రాణాంతక గుండె సమస్యలతో బాధపడుతున్న ఎందరో చిన్నారులకు మహేష్ బాబు కొత్త ఊపిరి పోశాడు. వందలమంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించి.. వారి గుండెల్లో దేవుడిలా కొలువయ్యారు.
మరి వేల గుండెలను బతికించిన మహేష్ బాబుపై విధి ఎందికిలా పగపట్టింది. పదే పదే ఆయనను ఎందుకు ఇలా కఠినంగా పరీక్షిస్తోందో అర్థం కావడం లేదు. మనం ప్రేమించిన మనిషి ఒక్కరు దూరమైతేనే.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఏళ్లు పడుతుంది. అలాంటిది.. ఒకే ఏడాది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన బంధాలును కోల్పోతే.. వారిని ఓదార్చడం ఎవరి తరం కాదు. అప్పటికే అలసిపోయిన ఆ శరీరంలో.. ఇక ఏడవడానికి కూడా కన్నీళ్లు లేవు. ప్రస్తుతం మహేష్ జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది.
ఏడాది వ్యవధిలోనే ఆయన కుటుంబంలో ముగ్గురు సభ్యులు మృతి చెందారు. అన్న, తల్లి, తండ్రి మృతితో మహేష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే మహేష్ బాబు కుటుంబంలో తొలి విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు రమేష్ బాబు.. లివర్ సంబంధిత వ్యాధితో ఈ ఏడాది జనవరిలో కన్ను మూశారు. అన్న మృతి.. మహేష్ బాబును ఎంతో కుంగదీసింది. ఎందుకంటే అన్నంటే.. మహేష్కు అంతులేని అభిమానం. తనను నాన్నలా చూసుకునేవాడని పలు సందర్భాల్లో మహేష్ బాబు అన్న గురించి చెప్పుకొచ్చాడు. ఇక రమేష్ బాబు మరణించిన సమయంలో మహేష్ బాబు కరోనా కారణంగా క్వారంటైన్లో ఉన్నాడు. దాంతో కనీసం అన్న అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి.
అన్న మరణంతో విషాదంలో మునిగిపోయిన మహేష్ బాబు జీవితంలో.. మరో చేదు సంఘటన చోటు చేసుకుంది. ఆయన తల్లి ఇందిరా దేవి కూడా ఈ ఏడాదే కన్ను మూశారు. వయో సంబంధిత వ్యాధితో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మృతి చెందారు. తల్లి మరణం మహేష్ బాబునే కాక.. కృష్ణను కూడా బాగా కుంగదీసింది.
తల్లి ఇందిరా దేవి మృతి చెంది.. కనీసం రెండు నెలలు కూడా గడవకముందే.. తండ్రి కృష్ణ కూడా మృతి చెంది.. మహేష్ను దెబ్బ మీద దెబ్బ తగిలింది. తీరని గుండెకోతను మిగిల్చింది. మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15 మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. సోమవారం గుండెపోటు కారణంగా.. ఆస్పత్రిలో చేరిన కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఇలా ఏడాది వ్యవధిలోనే మహేష్ బాబు ఇంట వరుసగా ముగ్గురు మృతి చెందడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ బాబుకు వచ్చిన కష్టాన్ని తల్చుకుని.. ఆయన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అన్న.. మేమందరం మీకు మద్దతుగా ఉన్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.