బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్యూట్ కపుల్ అనగానే గుర్తొచ్చేది వీళ్లే. మూడు సినిమాలు కలిసి చేశారు. ఆరేళ్లుగా రిలేషన్ లో ఉండి, నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వాళ్లే రణ్ వీర్ సింగ్-దీపికా పదుకొణె. అలాంటి వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్త, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ నోట ఈ నోట పడి.. చివరకు రణ్ వీర్ దగ్గరకే చేరింది. దీనిపై స్పందించిన రణ్ వీర్.. త్వరలో గుడ్ న్యూస్ కూడా చెబుతానని అన్నాడు. మరి ఇందులో నిజమెంత.. అసలు ఏం జరుగుతోంది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. రణ్ వీర్ సింగ్ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ లో స్టార్ హీరోగా మారాడు. మరోవైపు దీపికా పదుకొణె కూడా సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించి, పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రభాస్ ‘ప్రాజెక్టు k’లోనూ ఈమెనే హీరోయిన్. ఇక వీళ్లద్దరూ పద్మావత్, రామ్ లీలా, 83 సినిమాలు చేశారు. కలిసి నటిస్తున్న సమయంలో లవ్ లో పడిన వీరిద్దరూ.. 2012 నుంచి రిలేషన్ లో ఉన్నారు. కానీ ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అలా 2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రణ్ వీర్-దీపిక విడాకుల వార్త సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై రణ్ వీర్ కూడా స్పందించాల్సి వచ్చింది.
‘2012లో మేమిద్దరం కలుసుకున్నాం. అప్పటినుంచి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ఈ పదేళ్లలో దీపికపై ప్రేమ పెరిగిందే తప్ప అస్సలు తగ్గలేదు. మా మధ్య విబేధాలు లేవు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాం. అంతే కాదు త్వరలో మా నుంచి మీకో గుడ్ న్యూస్ రాబోతుంది. మేం కలిసి సినిమాలో నటించబోతున్నాం’ అని రణ్ వీర్ సింగ్ చెప్పాడు. దీన్నిబట్టి చూస్తుంటే తమపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టడం సహా ఫ్యాన్స్ ని అలరించే కొత్త విషయం కూడా బయటపెట్టాడు.