Margani Bharat: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్లు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. ఆ ముగ్గురు హైదరాబాద్లో ఉండి.. ఏపీలోని ప్రజలను అమరావతి కోసం ఎగదోసి బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు.. రైతుల పాదయాత్రను తిప్పికొడతారని చెప్పారు. గతంలో చంద్రబాబు జోలి యాత్ర చేశారని, ఆ డబ్బుతో ఇప్పుడు రైతుల పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. మంగళవారం మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ. ‘‘అమరావతి కోసం 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. పవన్ కల్యాణ్ ఆరు నెలలకొకసారి మేల్కొంటారు. దేనికి ప్యాకేజీ అందితే దానిపై ట్వీట్ పెడతారు. 25 ప్రాంతాలను 25 రాష్ట్రాలుగా మార్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా చేయాలని అంటున్నారు.
పవన్కు సినిమా మీద తప్ప.. రాజకీయాల మీద అవగాహన లేదు. సినిమా గ్లామర్ కారణంగా మిమ్మల్ని చూడటానికి ఫ్యాన్స్ మీ సభలకు వస్తారు. మీరు ఏదో మంచి చేస్తారని కాదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దమ్మున్న మగాడు. నిస్వార్థంగా ప్రజల స్థితిగతులు మార్చే కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు. ఆనాడు మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తానన్న వైఎస్సార్ మాటల్ని సీఎం జగన్ ఈనాడు నిజం చేస్తున్నారు. ప్రజల గడప దగ్గరకు పాలనను చేర్చాలన్నదే సీఎం జగన్ తపన. అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ఆయన లక్ష్యం. కాబట్టి మూడు రాజధానులు అనివార్యం’’ అని అన్నారు.