సాంకేతికంగా మనిషి ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా కూడా ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. క్షుద్రపూజలు, బాణామతి వంటివి ఉన్నాయని విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి వారి భయాన్ని అవకాశంగా చేసుకుని వాటి పేరుతో చాలా మందిని మోసం చేస్తున్నవారు లేకపోలేదు. జగిత్యాల జిల్లా అలాంటి ధోరణులు ఎక్కువవతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలకు దిగింది. అలాంటి స్థావరాలపై దాడులు చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఇటీవల జిల్లాలో మంత్రాల నెపంతో తండ్రి, ఇద్దరు కుమారులను హతమార్చారు. లోపల పాత కక్షలు అయినా కూడా పైకి మాత్రం ఆ పేరు వాడుకున్నారు. తాజాగా రాయికల్ మండలంలో మంత్రాలు, క్షుద్రపూజలు చేస్తున్నారు. పద్ధతి మార్చుకోకుంటే మరణశిక్ష తప్పదని ఫ్లెక్లీ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రజల్లో భయాందోళన ఎక్కువైంది. వారికి ధైర్యం తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపడ్డారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లోని స్థావరాలపై దాడులు చేశారు.
ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు సేకరించి.. విచారణ చేసిన తర్వాత వారిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మూఢనమ్మకాల పేరుతో అమాయకులతో ఆడుకుంటున్నారని.. ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఆర్థికంగా ప్రజలు నష్టపోతున్నారని ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొందరి కక్ష, పగలను కూడా ఆసరగా చేసుకుని పూజలు చేస్తామంటూ డబ్బు దండుకుంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి 78 మందిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసినా.. వారికి హాని చేసినా కూడా చర్యలు కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.