తమిళనాడులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 10 రోజుల కిందట సమాధిలో ఓ బాలిక మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. అయితే ఉన్నట్టుండి 10 రోజుల తర్వాత సమాధిలో పాతిపెట్టిన ఆ బాలిక త మాయమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం పరిధిలోని చిత్రవాడ. ఇదే గ్రామంలో కృతిక అనే పదేళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే అక్టోబర్ 5న ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తులో విద్యుత్ స్థంభం ఆ బాలిక మీద పడింది. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన ఆ బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ బాలిక అక్టోబర్ 14న మరణించింది. దీంతో కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక అనంతరం అక్టోబర్ 15న కుటుంబ సభ్యులు ఆ బాలిక మృతదేహాన్ని సమాధిలో పాతిపెట్టి అంత్యక్రియలు జరిపారు. కట్ చేస్తే 10 రోజుల తర్వాత ఆ బాలికకు అంత్యక్రియలు జరిపిన సమాధి తవ్వి పక్కన కుంకుమ, పసుపు కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక కుటుంబ సభ్యులు సమాధిలోకి చూడగా ఆ బాలిక తల మాయమైందని నిర్ధారించారు.
అనంతరం ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారుల సాయంతో అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సూర్య గ్రహణం, అమవాస్య ఉన్న కారణంగా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజల కోసం ఆ బాలిక తలను తీసుకెళ్లారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.