ఆ యువకుడు భవిష్యత్తు గురించి కోటి కలలు కన్నాడు. పోలీసు జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి.. క్యాబ్ డ్రైవర్గా పని చేస్తూనే.. పోలీసు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నాడు. కుటుంబం పట్ల ఇంత బాధ్యతగా వ్యవహరిస్తున్న కొడుకు మీద తల్లిదండ్రులు ప్రాణాలే పెట్టుకున్నారు. కుమారుడు ఉద్యోగం సాధించి.. తమకు అండగా నిలబడతాడని నమ్ముతున్న వారి జీవితాల్లో తీరని విషాదం మిగిలింది. ఆకతాయిలు చేసిన పనికి.. ఆ యువకుడు ఫలితం అనుభవిస్తున్నాడు. పోలీసు కావాలని కలలు కన్నా యువకుడు.. ప్రస్తుతం కోమాలోకి వెళ్లి.. కదల్లేని స్థితిలో ఆస్పత్రి బెడ్కే పరిమితం అయ్యాడు.
గత 87 రోజులుగా అతడికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 46 లక్షల రూపాయలు ఖర్చయింది. అయినా యువకుడి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇదంతా ఒక ఎత్తయితే.. యువకుడికి ఈ పరిస్థితి కల్పించిన వారు.. బెయిల్ మీద బయటకు వచ్చి దర్జాగా తిరుగుతుంటే.. కుటుంబం కోసం తాపత్రయ పడిన తమ బిడ్డ.. ఇలా చలనం లేకుండా ఆస్పత్రిలో పడి ఉండటం.. ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కుటుంబం పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెంకు చెందిన అంజయ్య గౌడ్, వెంకటమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు.. కుమారుడు వెంకటేష్ సంతానం. వారిది సన్నకారు రైతు కుటుంబం. వచ్చే ఆదాయంతో గుట్టుగా జీవిస్తున్నారు. నలుగురు ఆడపిల్లలకు పెళ్లిల్లు చేశారు. ఇక కుమారుడు వెంకటేష్.. డిగ్రీ పూర్తి చేసి.. పోలీసు జాబ్కు ప్రిపేరవ్వడం కోసం హైదరాబాద్ వచ్చాడు. బీఎన్రెడ్డి నగర్లో అద్దెకుంటూ.. పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే తన చదువు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుడదన్న ఉద్దేశంతో.. పార్ట్టైమ్గా ఓలాలో క్యాబ్ డ్రైవర్గా పని చేసేవాడు.
ఇలా ఉండగా.. జూలై 31న వివేక్రెడ్డి అనే వ్యక్తి.. బీఎన్రెడ్డి నగర్ నుంచి ఉప్పర్పల్లికి వెళ్లడానికి వెంకటేష్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో 200 రూపాయల కోసం వివేక్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో వివేక్ రెడ్డి.. తన స్నేహితులను 20 మందిని పిలిపించి.. వెంకటేష్ మీద దాడి చేపించాడు. వారంతా బ్యాట్లు, వికెట్లతో విచక్షణ మరిచి.. అత్యంత దారుణంగా వెంకటేష్ మీద దాడి చేశారు. ఈ సంఘటనలో వెంకటేష్ తీవ్రంగా గాయపడటమే కాక కోమాలోకి వెళ్లాడు. అయితే ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించలేదు. మీడియాలో దీని గురించి వార్తలు రావడంతో.. ఆ తర్వాత వివేక్ రెడ్డితో పాటు కొందరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా బెయిల్ మీద బయటకు వచ్చారు.
ఇక తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగపడలేదు. ఇప్పటి వరకు అతడి వైద్యానికి 46 లక్షలు ఖర్చు చేశారు తల్లిదండ్రులు. ఇందుకోసం గ్రామంలో వారికున్న ఎకరన్నర పొలంలో ఎకరం 30 లక్షలకు అమ్మి కుమారుడి వైద్యానికి ఖర్చు చేశారు. మరో 16 లక్షలు అప్పు చేశారు. ఇప్పటికి మూడు ఆస్పత్రులు మార్చినా వెంకటేష్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. లక్షలు ఖర్చు చేసిన కుమారుడు కోలుకోలేదు.
ప్రస్తుతం ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి చేతిలో రూపాయి లేక.. ఆదుకునేవారి కోసం వెంకటేష్ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఎదిగిన కొడుకు చేతికి అందివస్తాడని భావిస్తే.. ఇలా చలనం లేకుండా కోమాలోకి వెళ్లి ఆస్పత్రి పాలవ్వడం.. మరో వైపు తమకు ఇంత కడుపుకోత మిగిల్చిన వారు దర్జాగా బయట తిరగడం ఆ తల్లిదండ్రులను మరింత కలిచి వేస్తుంది. ఇక ప్రభుత్వం స్పందించి.. తమను ఆదుకోవాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు.