Crime News: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. మంచి, చెడ్డలు మరిచి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ యువకుడిపై అత్యంత పాశవిక చర్యకు పాల్పడ్డారు కొందరు పోలీసులు. అక్రమంగా అదుపులోకి తీసుకోవటమే కాకుండా.. అతడ్ని చిత్ర హింసలకు గురిచేశారు. 12 రోజుల పాటు వేధించారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు హైకోర్టులో, మానహక్కుల సంఘంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఏ. రాజేష్ అనే యువకుడు బెంగళూరులోని రామమూర్తి నగర్లో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 4వ తేదీన ఓ ఏడుగురు పోలీసులు బి నారాయణ పురం బస్ స్టేషన్ వద్ద ఉండగా అతడ్ని కారులో ఎక్కించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్లోకి వెళ్లగానే మెల్విన్ అనే పోలీస్ ఇన్స్పెక్టర్ వారికి కొన్ని ఆదేశాలు జారీ చేశాడు. మెల్విన్ ఆదేశాల ప్రకారం వారు అతడ్ని మేడపైకి తీసుకెళ్లారు. విచక్షణా రహితంగా కొట్టడం ప్రారంభించారు. క్రికెట్ బ్యాట్లు, కర్రలతో దాడి చేశారు. మూడు రోజులు వరుసగా అతడి ప్రైవేట్ పార్టుకు కరెంట్ షాక్ ఇచ్చారు. మూత్రాన్ని వారి బూట్లకు అంటించుకుని, అతడి శరీరానికి పూశారు. వారు కొట్టిన దెబ్బలకు అతడి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. సబ్ ఇన్స్పెక్టర్ శివరాజ్ తన బూటు కాలుతో రాజేష్ ముఖంపై దాడి చేశాడు. గుండెలపై కూడా కొట్టాడు. దాదాపు 12 రోజులు రాజేష్ను తీవ్రంగా వేధించారు. ఆ తర్వాత ఇంటికి పంపారు.
ఈ విషయం బయటకు చెబితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. రాజేష్ ఇంటికి వెళ్లిపోయిన వెంటనే ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత తనపై దాడి చేసిన పోలీసులపై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నాడు. హైకోర్టులో, మానహక్కుల సంఘంలో దీనిపై ఫిర్యాదు చేశాడు. తనను హత్య కేసు ఒప్పుకోమంటూ వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధికారులు శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తమపై వచ్చిన ఆరోపణలను సదరు పోలీసులు ఖండించారు. దొంగతనం కేసులో అతడ్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అయితే, అధికారులు సదరు పోలీసులను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.