ఆమెకు పెళ్లై మూడేళ్లు అవుతుంది. తల్లిదండ్రుల లేకున్నా బంధువులు అంతా ఏకమై ఆ యువతికి ఘనంగా పెళ్లి చేశారు. అలా పెళ్లైన కొంత కాలానికి ఆ మహిళ ఓ కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో ఆమె జీవితం సంతోషంగా సాగిపోతున్న తరుణంలోనే భర్త బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాడు. డబ్బుకు ఆశపడి ఏకంగా కట్టుకున్న భార్య అని చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా లక్ష్మిరావులపల్లి గ్రామంలో నవీన్ కుమార్, రవళి (25) భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై మూడేళ్లు అవుతుంది. అయితే రవళికి తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులు అంతా ఏకమై ఘనంగా పెళ్లి చేశారు. ఇక కొంత కాలానిక భర్త నవీన్ కుమార్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. అలా రోజులు గడుస్తున్న కొంతకాలానికి ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. దీంతో పుట్టిన బిడ్డతో ఆ దంపతుల కాపురం సంతోషంగా సాగిపోతోంది.
ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి భర్త నవీన్ కుమార్ అదనపు కట్నం తేవాలంటూ భార్య రవళిని వేధించడం మొదలు పెట్టాడు. అనేక సార్లు తనపై చేయి కూడా చేసుకున్నాడు. రవళికి తల్లిదండ్రులు లేకపోవడంతో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అస్సలు అర్థం కాలేదు. ఇక అయినా కనికరం చూపించని నవీన్ కుమార్ అదనపు కట్నం తేవాల్సిందే అంటూ రోజూ రవళికి నరకం చూపించాడు. భర్త వేధింపులను భరించలేని రవళి మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే స్పందించిన భర్త నవీన్ కుమార్ రవళిని స్థానిక ఆస్పత్రికి తరలించాడు.
ఇక చికిత్స పొందుతూ రవళి బుధవారం కన్నుమూసింది. రవళి మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై రవళి బంధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త నవీన్ కుమార్ రవళిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. భాదిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది.