వీరికి పెళ్లై నాలుగు నెలలు అయింది. కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెట్టడంతో అత్తమామలు సైతం ఆనందంతో మురిసిపోయారు. ఈ నవ వధువు కన్నవారిని, ఉన్నఊరిని వదిలి తాళికట్టిన భర్తపై నమ్మకంతో అత్తింట్లో అడుగు పెట్టింది. ఇక పెళ్లైన కొన్ని రోజుల వరకు ఈ నవ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కట్ చేస్తే కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు ఉరి తాడుకు వేలాడుతు కనిపించింది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ విషాద ఘటన వెనుక అసలు ఏం జరిగిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వీరిది గద్వాల జిల్లా కేతిరెడ్డిపల్లి మండలం తూర్పుతండా. ఇదే ప్రాంతానికి చెందిన రేణమ్మ(19), శ్రీను దంపతులు. నాలుగు నెలల కిందటే వీరికి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన అనంతరం ఉన్న ఊరిలో ఉపాధి దొరకకపోవడంతో శ్రీను తన భార్యను తీసుకుని రాజేంద్రనగర్ లోని బద్వెల్ లో నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్లైన కొన్ని రోజులు మాత్రమే ఈ నవ దంపతులు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి భర్త శ్రీను భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో అనేక సార్లు రేణమ్మపై చేయి కూడా చేసుకున్నట్లు సమాచారం.
అయితే ఆ మహిళ ఇటీవల తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. నా భర్త నన్ను తీవ్రంగా వేధిస్తూ టార్చర్ పెడుతున్నాడని తన బాధనంత తల్లిదండ్రులతో చెప్పుకుంది. రేణమ్మ తల్లిదండ్రులు మాత్రం.. కొత్త సంసారం కదా మాములే అనుకుని భార్యాభర్తలిద్దరికీ సర్దిచెప్పారు. కట్ చేస్తే బుధవారం ఉదయం రేణమ్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ రేణమ్మ తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ తల్లిదండ్రులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఉరి వేలాడుతున్న కూతురుని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఆనంతరం ఈ ఘటనపై రేణమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. మా కూతురిని భర్త శ్రీను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు రేణమ్మ తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేణమ్మ నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక భర్త శ్రీను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.