Garbage: పరమానందయ్య శిష్యుల కథ సినిమా మీరు చూసే ఉంటారు. ఆ సినిమాలో పరమానందయ్య శిష్యులు చేసే తిక్క పనులు పరమానందయ్యకు మొదట ఇబ్బంది కలిగించినా తర్వాత మేలు చేస్తుంటాయి. వాళ్లు ఏం చేసినా గురువుకు మంచే జరుగుతుంటుంది. అచ్చం అలాంటిదే కాకపోయినా.. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలు కాపాడింది. చెత్త కారణంగా ఓ పెద్ద ప్రమాదం నుంచి కొందరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్ర, ముంబైకి చెందిన సంతోష్ యాదవ్ సెప్టెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఓ టీ షాపు దగ్గర కారు ఆపాడు. కొట్టులో కూర్చుని టీ తాగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అతడి స్నేహితుడు రాజు యాదవ్ అక్కడికి వచ్చాడు. సంతోష్ దగ్గరినుంచి కారు తాళాలు తీసుకుని కారు దగ్గరకు వెళ్లాడు.
తన మొబైల్ ఫోన్కు ఛార్జింగ్ పెట్టడానికి కారులోకి ఎక్కాడు. కారును స్టార్ట్ చేశాడు. ఆ వెంటనే పొరపాటున యాక్సిలరేటర్పై కాలు పెట్టాడు. అతడికి తెలియకుండానే కారు ముందుకు దూసుకుపోయింది. కారును ఆపటం అతడి వల్ల కాలేదు. రోడ్డు పక్కగా నడుచుకుంటూ పోతున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. కొంతమందిని అలాగే ముందుకు ఈడ్చుకుపోయింది. బాధితుల అదృష్టం కొద్దీ రోడ్డు పక్కన ఉన్న చెత్త వారి ప్రాణాలు కాపాడింది. కారు చెత్త మీదకు రావటంతో ముందుకు కదల్లేక ఆగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన జనం హుటాహుటిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు రాజు యాదవ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటనపై బాధితుల్లో ఒకరైన స్వప్న సంగారే మాట్లాడుతూ.. ‘‘ ఈ ఘటనలో మా అబ్బాయిని కోల్పోయే దాన్ని. కానీ, నేను కారు మా వైపు రావటం చూశాను. ఆ వెంటనే మా అబ్బాయిని పక్కకు తోశాను. అయితే, కారు నన్ను ఢీకొట్టింది. కొంత దూరం ఈడ్చుకుపోయింది. తలపై,కడుపుపై తీవ్రగాయాలయ్యాయి’’ అని తెలిపింది. ఆమె భర్త ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేశాడు. గేర్లో ఉన్న కారు ఎలా స్టార్ట్ అవుతుందని ప్రశ్నించాడు. నిందితుడు కారు నేర్చుకోవటానికి ప్రయత్నించి ఈ ప్రమాదానికి కారణం అయి ఉంటాడని భావిస్తున్నాడు.