మనుషుల్లో నేరప్రవృత్తికి ప్రధాన కారణం వారు పెరిగిన పరిస్థితులే అంటారు. చాలా మంది నేరస్తుల జీవితాలను పరిశీలిస్తే.. ఈ వ్యాఖ్యలు నిజమని అర్థం అవుతాయి. తల్లిదండ్రుల ఆదరాభిమానాలకు నోచుకోలేక.. నిర్లక్ష్యం చేయబడితే.. ఆ సంఘటన వారి మనసుల్లో అలాగే ముద్రించుకుపోతుంది. చాలా మంది.. పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోతారు. కానీ కొందరు మాత్రం జరిగిన సంఘటనలకు ఎవరో ఒకరిని బాధ్యులగా ఊహించుకుని.. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో.. నేర ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఆ తర్వాత వారి చేసే నేరాలకు అంతు పొంతు ఉండదు. నేర సామ్రాజ్యం అలా విస్తరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న వ్యాఖ్యలన్ని ఓ నేరస్తుడి జీవితానికి సరిగ్గా సరిపోతాయి. వరుస హత్యలు చేస్తూ.. పలు దేశాల్లో.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన నేరస్తుడి విడుదలకు కోర్టు ఆదేశించడంతో.. ఒక్కసారిగా ప్రజలు మర్చిపోయిన అతడి నేర చరిత్ర మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..
చార్లెస్ శోభరాజ్.. లేదా బికినీ కిల్లర్ అనగానే.. అతడి వాల్ల బాధపడిన కుటుంబాలు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతారు. అతడి నేర ప్రవృత్తి గురించి పూర్తిగా తెలియని వాళ్లు మాత్రం సెలబ్రిటీలా భావిస్తారు. అయితే అతడో సీరియల్ కిల్లర్ అని.. తొమ్మిది దేశాల పోలీసులు అతడి కోసం గాలించారని.. ప్రస్తుత తరానికి తెలియదు. తొమ్మిది దేశాల్లో హత్యలు చేసిన చార్లెస్ శోభరాజు.. గత 19 ఏళ్లుగా హత్యా నేరం కింద.. నేపాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 70 ఏళ్లకు పైబడిన వృద్ధుడు కావడంతో.. నేపాల్ కోర్టు అతడి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. శోభరాజ్ ప్రస్తుతం నేపాల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. అతడిని 15 రోజుల్లోగా తన దేశానికి పంపించాలని నేపాల్ సుప్రీం కోర్టు.. అధికారులను ఆదేశించింది. దాంతో మరోసారి అతడి నేర చరిత్ర వెలుగులోకి వచ్చింది.
చార్లెస్ శోభరాజు.. భారత పౌరుడికి, వియాత్నం మహిళకు 1944, ఏప్రిల్ 6న జన్మించాడు. అతడి పూర్తి పేరు హాత్చంద్ భావ్నాని గురుముఖ్ చార్లెస్ శోభరాజ్. అతడు జన్మించిన కొన్నాళ్లకు తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత చార్లెస్ తల్లి.. ఓ ఫ్రెంచ్ వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడు చార్లెస్ని దత్తత తీసుకున్నాడు. కానీ వారికి సంతానం కలిగిన తర్వాత.. చార్లెస్ను నిర్లక్ష్యం చేయసాగారు. దాంతో.. అతడు బాల్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ సంఘటనలు అతడి మనసుపై తీవ్ర ప్రభావం చూపి.. నేర ప్రపంచంవైపు అతడి అడుగులు పడేలా చేశాయి. చిన్న చిన్న నేరాలకు పాల్పడతూ.. తొలిసారి దోపిడికి సంబంధించి.. 1963 లో పారిస్ సమీపంలోని పాయిసీ జైలులో తన మొదటి జైలు శిక్ష అనుభవించాడు.
అది మొదలు.. అప్పటి నుంచి అతడి నేర జీవితం ప్రారంభం అయ్యింది. ఇక శోభరాజ్కు ఓ గర్ల్ఫ్రెండ్ కూడా ఉంది. వీరిద్దరూ వివాహం కూడా చేసుకోవాలని భావించారు. కానీ సరిగ్గా పెళ్లి రోజే.. దొంగిలించిన కారులో తిరుగుతూ పట్టుబడి జైలుకు వెళ్లాడు. అలా ఆ పెళ్లి ఆగిపోయింది. కానీ అతడి గర్ల్ఫ్రెండ్ మాత్రం చార్లెస్ కోసం ఎదరుచూడసాగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా శోభరాజు.. తన నేర ప్రవృత్తిని వదులుకోలేదు. పైగా నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. 9 దేశాల్లో నేరాలకు పాల్పడ్డాడు. వీటిల్లో మన దేశం కూడా ఉంది.
భారత్, నేపాల్, మయన్మార్, థాయ్లాండ్, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ సహా తొమ్మిది దేశాల పోలీసులు చార్లెస్ కోసం ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. పోలీసులు కన్ను గప్పడం.. వారికి లంచాలు ఎర వేసి పారిపోవడంలో.. చార్లెస్ సిద్ధహస్తుడు. పోలీసుల వల నుంచి పాముల జారి పోయేవాడు అని ప్రసిద్ధి. ఇక తన నేరాలకు సంబంధించి.. చార్లెస్ నాలుగు దేశాల్లో మాత్రమే ఎక్కువకాలం ఖైదీగా జీవితాన్ని కొనసాగించాడు. చార్లెస్కు బికినీ కిల్లర్ అనే పేరుంది. 70వ దశకంలో చార్లెస్ ఆగ్నేయాసియాలో 12 మంది పర్యాటకులను హత్యచేశాడు. నీటిలో ముంచడం, గొంతు నులిమి చంపడం, కత్తితో పొడవడం చేసేవాడు. కొన్ని సందర్భాల్లో.. సజీవదహనం ద్వారా.. బాధితులకు దగ్గరయ్యి.. వారిని హత్య చేసేవాడు. బీచ్లలో బికినీ ధరించిన టూరిస్ట్ అమ్మాయిలను ఎక్కువగా చంపేవాడు. దీంతో చార్లెస్ను బికినీ కిల్లర్ అని కూడా పిలుస్తారు.
చార్లెస్ తన జీవితంలో.. 20కి పైగా హత్యలకు పాల్పడ్డాడు. ఫ్రెంచ్ టూరిస్ట్కు విషం ఇచ్చి చంపినందుకుగాను.. అతను 21 సంవత్సరాలు భారతీయ జైలులో ఉన్నాడు. 1997 ఫిబ్రవరి 17 న, 52 వ ఏట చార్లెస్ విడుదలయ్యాడు. అతడిపై ఉన్న అనేక వారెంట్లు, సాక్ష్యాలు, అతనికి వ్యతిరేకంగా సాక్షులు కూడా లేకుండా పోయారు. అతడిని అప్పగించడానికి ఏ దేశమూ లేనందున, భారత అధికారులు అతడిని ఫ్రాన్స్కు తిరిగి వెళ్లనిచ్చారు. ఫ్రాన్స్లో చార్లెస్ సెలబ్రిటీ హోదా అనుభవించాడు. ఆ తర్వాత 2003లో ఖాట్మండులోని ఓ క్యాసినోలో కనిపించిన అతడిని నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. 1975లో నేపాల్లో అమెరికన్ టూరిస్ట్ అయిన కొన్నీ జో బ్రోంజిచ్ హత్య కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. 2014లో అతను కెనడియన్ బ్యాక్ప్యాకర్ లారెంట్ క్యారియర్ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు. దాంతో కోర్టు రెండవ జీవిత ఖైదు విధించింది.
ఇక జైల్లో ఉండగానే చార్లెస్ శోభరాజు.. 2008లో నేపాలీ మహిళ నిహిత బిశ్వాస్ను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక తాజాగా శోభరాజ్.. తనకు విధించిన శిక్షలకు సంబంధించి.. నిర్దేశించిన దానికంటే ఎక్కువ కాలం జైలులో గడిపానని.. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల దృష్టా తనను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నేపాల్లో 75 శాతం శిక్ష అనుభవించిన ఖైదీలు.. జైలులో మంచి ప్రవర్తనతో మెలిగితే.. వారిని విడుదల చేసేందుకు చట్టపరమైన నిబంధన ఉంది. నేపాల్లోని సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన ‘సడలింపు’ ప్రకారం తాను జైలు శిక్షను పూర్తి చేశానని తన పిటిషన్లో శోభరాజ్ పేర్కొన్నాడు. 20 సంవత్సరాల జైలు శిక్షలో ఇప్పటికే 17 సంవత్సరాలు గడిపానని.. ఇక తన వయసు, అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాల్సిందిగా కోరుతూ.. సుప్రీంకోర్టు ఆశ్రయించాడు. చార్లెస్ పిటిషన్ను విచారించిన కోర్టు.. అతడిపై పెండింగ్ కేసులేవి లేకపోతే.. బుధవారమే అతడిని విడుదల చేసి.. 15 రోజుల్లోగా అతడి దేశానికి పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
రణదీప్ హుడా నటించిన ‘మెయిన్ ఔర్ చార్లెస్’ చిత్రం శోభరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఆ సమయంలో నటుడు కిల్లర్ని కూడా జైలులో కలిశాడు. ఈ చిత్రంలో శోభరాజ్ పాత్రను రణదీప్ హుడా పోషించాడు. ఈ చిత్రం 30 అక్టోబర్ 2015న విడుదలైంది. ఇతడి జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతుంది. 9 దేశాల పోలీసులను పరుగులు పెట్టించిన చార్లెస్ శోభరాజు.. తన నేరాలకు తగిన శిక్ష అనుభవించాడని మీరు భావిస్తున్నారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.