వాళ్లిద్దరిది చూడముచ్చటైన జంట. వీరి జంటను చూసి ఊళ్లో కొందరు ఆడొళ్లు సైతం ఈర్ష్యపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఎంతో ముచ్చటగా ఉన్న ఈ జంటను చూసి అత్తింటి కుటుంబ సభ్యులు కూడా సంతోషపడ్డారు. ఇక కోడలు అడుగు పెట్టడంతో అత్తమామల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. అలా పెళ్లైన ఆరు నెలల పాటు ఈ దంపతులు సంతోషంగా జీవించారు . కట్ చేస్తే ఈ నవ దంపతులే ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయారు. ఈ ఘటనతో అత్తింటివాళ్లు, పుట్టింటివాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పడమటితండా. ఇదే గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మణ్ (24)కి కొత్తపల్లి గ్రామ పరిధిలోని మేగావత్ తండాకు చెందిన నిఖిత(20)తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ నవ దంపతుల దాంపత్య జీవితం సాఫీగా సాగింది. ఇక పెళ్లి అనంతరం ఈ దంపతులు వీరి ఊళ్లోనే కిరాణ షాపును నడిపిస్తూ కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. అలా వీరి సంసారం ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా సాగింది. అయితే తాజాగా మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి ఏదో సరుకులు నిమిత్తం లక్ష్మణ్ కిరాణ షాపు వద్దకు వెళ్లాడు.
షాపులో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోకి వెళ్లి పిలిచే ప్రయత్నం చేయగ లక్ష్మణ్, నిఖిత ఇద్దరు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సీన్ ను చూసిన ఈ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లైన ఆరు నెలలకే ఈ నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.