మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడి ఘటనలు మనం ఎప్పుడూ వింటుంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్. మైనర్ బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని ధారావి ప్రాంతంలో చోటుచేసుకుంది. సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలుడితో పరిచయం పెంచుకున్న యువతి.. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. దీంతో విసిగిపోయిన బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబాయిలోని ధారావి ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతికి బీహార్ కు చెందిన 17 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహానికి దారి తీసింది. దీంతో వారిద్దరూ తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఒకరి విషయాలు మరొకరితో పంచుకునే వారు. దీనిని ఆ బాలుడు స్నేహం అనుకున్నాడు. కానీ ఆ యువతి ఇదంతా ప్రేమ అనుకుంది. ఈ క్రమంలో ఒకరోజు బాలుడికి సదరు యువతి లవ్ ప్రపోజ్ చేసింది. దీనికి బాలుడు అంగీకరించలేదు. దీంతో పాటు ఆమె నుంచి కాల్స్ రాకుండా ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేశాడు. అలాగే సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్లాక్ లో పెట్టాడు. కానీ యువతి మాత్రం అతడిని వదిలిపెట్టలేదు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించింది. వాటి ద్వారా అతడిని వేధించడం మొదలు పెట్టింది.
ఇది కూడా చదవండి: Vizag: పెళ్లింట విషాదం: జీలకర్ర బెల్లం సమయానికి కుప్పకూలిన వధువు!
ఈ క్రమంలో సదరు బాలుడు ఉద్యోగం కోసం ఈ ఏడాది జనవరి 19న ముంబాయికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తనను కలవాలని కోరింది. ధారవిలో ఉన్న తన ఇంటికి రావాలని అడిగింది. ఆమె మాటలు నమ్మి బాలుడు యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతి అతడిపై లైంగిక దాడి చేసింది. ఈ ఘటన తరువాత కూడా ఆ బాలుడిని ధారావి సమీపంలోని ఓ లాడ్జికి పిలిపించుకుంది. అక్కడ కూడా అతనిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ మధ్య కాలంలో లైంగికంగా వేధించడం ఎక్కువవడంతో.. విసిగిపోయివున బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో మైనర్ ఫిర్యాదు మేరకు యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. యువతి సైతం.. బాలుడి కుటుంబంపై కేసు పెట్టింది. సదరు బాలుడు, అతడి తండ్రితో పాటు మరో ఐదుగురు కలిసి తనను రేప్ చేశారని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.