ప్రభుత్వ ఆస్పత్రులను మంత్రులు, అధికారులు ఎంత పర్యవేక్షిస్తున్నా.. జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు వైద్యులు మాత్రం నిర్లక్ష్య ధోరణిని వీడటం లేదు. అలాంటి వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రసవాల విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అలాంటి విమర్శలకు బలాన్ని చేకూర్చేలా ఓ ఘటన చోటుచేసుకుంది. వైద్యులు చేసిన పనికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. మొదట సాధారణ ప్రసవం చేస్తామంటూ చెప్పి.. చివర్లో చేతులెత్తేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ప్రసవం కోసం సుధ అనే మహిళ శుక్రవారం కోలారు జిల్లాలోని దొడ్డ శివారులోని ప్రాథమిక ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు విపరీతమైన నొప్పులు రాగా వైద్యులు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెకు ఉన్నట్టుండి ఫిట్స్ రావడంతో పరిస్థితి బాగా లేదని తమ వల్ల కాదని జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా కుటుంబ సభ్యులకు తెలిపారు. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు సుధను జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె ఆడ శిశువుకి జన్మనిచ్చి కన్నుమూసింది. కాసేటి తర్వాత ఆ శిశువు కూడా మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. వైద్యుల నిర్లక్షం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయింది అంటూ ఆరోపణలు చేశారు.
మృతురాలి కుటుంబసభ్యులు సోమవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే సుధతో పాటు చిన్నారి ప్రాణాలు కూడా పోయాయని.. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసన తెలియజేశారు. బాధితుల నిరసనతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, సుధకు ఆరేళ్ల పాప ఉంది. ఆమె మరణానికి కారణం వైద్య సిబ్బంది అని.. సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించి రెండు నిండు ప్రాణాలు బలి తీసుకున్నారని.. తనకు న్యాయం చేయాలని సుధ భర్త డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంపై వైద్యాధికారి, పోలీసులు విచారణ జరుపుతామని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.