సాధారణంగా ఏ లోన్ తీసుకున్నా నెల నెలా వడ్డీ అనేది కడుతూ ఉండాలి. కానీ ఈ లోన్ తీసుకుంటే బతికినంత కాలం ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టే పని లేదు. ఈ లోన్ కేవలం వృద్ధులకు మాత్రమే.
పిల్లలు లేని తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. అలాంటి తల్లిదండ్రులకు సొంత ఇల్లు ఉంటే గనుక పిల్లలు పట్టించుకోకపోయినా కూడా మహరాజులా, మహారాణిలా బతకచ్చు. పిల్లల కోసం 60 ఏళ్ల వయసు వచ్చే వరకూ గొడ్డు చాకిరి చేసి రిటైర్ అయ్యాక కృష్ణారామ అనుకుని జీవిద్దామంటే జీవితం అనుకున్నట్టు ఉండదు. డబ్బు ఉండాలి. పిల్లలా చూడరు. ఉన్న ఇల్లు పిల్లల పేరు మీద పెడదామంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. వయసులో ఉండగా సంపాదన అంతా పిల్లల చదువులకే అయిపోయింది. పొదుపు చేయలేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు చేయలేదు. వృద్ధాప్యం వచ్చేసింది. ఇల్లు ఉంది, కానీ పెన్షన్ రాదు. వచ్చినా సరిపోవు.
మహారాజులా బతికిన వారు ఎందుకు రాజీ పడాలి. ఇంకా కక్కుర్తిగా తిని ఎవరి కోసం పోగేయాలి. పట్టించుకోని పిల్లల గురించి పట్టించుకోనవసరం లేదు. బతికినంత కాలం దర్జాగా బతకచ్చు. సొంత ఇల్లు తప్ప బతకడానికి ఎటువంటి ఆదాయ మార్గం లేని వారి కోసమే ఈ రుణం. రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా బతకడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతా పథకాల్లో పెట్టిన డబ్బు వడ్డీ రూపంలో వస్తుంది. అయితే వడ్డీ రేట్లు పడిపోయినా, ద్రవ్యోల్బణం పెరిగినా, మందుల ఖర్చులు పెరిగిపోయినా వృద్ధులకు ఆ వడ్డీ డబ్బులనేవి సరిపోవు. ఇలాంటి వారి కోసం ఉంటున్న సొంత ఇంటి ద్వారా నెల నెలా పెన్షన్ లా డబ్బు పొందవచ్చు.
సాధారణంగా ఒక ఇంటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుంది. లేదా ఇంటి మీద లోన్ తీసుకోవడం ద్వారా డబ్బు వస్తుంది. కానీ ఆ వయసులో లోన్ తీర్చలేరని చెప్పి వృద్ధులకు రుణం అనేది ఇవ్వరు. కానీ రివర్స్ మోర్టగేజ్ లోన్ అనేది మీ అవసరాలకు నెల నెలా ఆదాయం ఇస్తుంది. ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఈ రుణాన్ని ఇస్తున్నాయి. మీ ఇంటి విలువలో 80 శాతం మాత్రమే రుణంగా ఇస్తాయి. ఉదాహరణకు మీ ఇంటి విలువ కోటి రూపాయలు అయితే రూ. 80 లక్షల వరకూ రుణాన్ని ఇస్తాయి. 60 ఏళ్ళు ఆపైబడిన వయసు వారికి మాత్రమే ఇస్తాయి. ఈ రూ. 80 లక్షలను మీకు నెలకు ఇంత చొప్పున ఇవ్వమన్నా ఇస్తుంది. లేదా 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి ఇవ్వమన్నా ఇస్తుంది.
అయితే మీరు పెట్టుకున్న లోన్ అమౌంట్ రూ. 80 లక్షలకు వడ్డీ తీసుకోదు. కేవలం నెల నెలా మీకు బ్యాంకు చెల్లించే డబ్బులకు మాత్రమే వడ్డీ వేసుకుంటుంది. ఈ వడ్డీని, అసలును ఇప్పుడు తీసుకోదు. లోన్ పెట్టుకున్న వ్యక్తి, అలానే అతని భాగస్వామి చనిపోయిన తర్వాత ఆ ఇంటిని వేలం వేయగా వచ్చిన డబ్బుల్లోంచి తీసుకుంటారు. అది కూడా న్యాయబద్ధంగా ఎంత అయితే అంతే తీసుకుంటారు. మిగతా సొమ్ము పిల్లలు ఉంటే వారికి ఇచ్చేస్తారు. లేదంటే అయిన అప్పు పిల్లలు తీర్చేస్తే ఇల్లు పిల్లలకే ఇచ్చేస్తారు. లేదా పిల్లలే వేలంలో ఇంటిని కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంకులు 15 ఏళ్ళు, కొన్ని బ్యాంకులు 20 ఏళ్ల వరకూ మాత్రమే ఈ లోన్ పై నెల నెలా వాయిదాలను చెల్లిస్తాయి. లోన్ పీరియడ్ ముగిసిన తర్వాత బ్యాంకులు మీకు నెల నెలా వాయిదాలు చెల్లించడం ఆపేస్తాయి.
అయినప్పటికీ మీరు లోన్ తీర్చక్కర్లేదు. వడ్డీ కట్టక్కర్లేదు. బతికినంత కాలం మీ ఇంట్లోనే ఉండవచ్చు. వృద్ధ దంపతులు చనిపోయిన తర్వాత మాత్రమే బ్యాంకుకి ఆ ఇంటి మీద హక్కులు ఉంటాయి. చనిపోయిన తర్వాత ఆ ఇంటి మీద తీసుకున్న అప్పు, అయిన వడ్డీ లెక్కించి వారసులు ఉంటే వారికి సమాచారం అందజేస్తుంది. వారు పట్టించుకోకపోతే వేలంలో అమ్మేసి మిగతా డబ్బు వారసులకు ఇస్తుంది. కాబట్టి వృద్ధ దంపతులిద్దరూ రిటైర్మెంట్ తర్వాత రాజారాణిలా దర్జాగా బతకవచ్చు. మీరు ఖర్చులు తగ్గించుకుంటే వడ్డీ తక్కువ అవుతుంది. పిల్లలు లేని వారికి, పిల్లలు పట్టించుకోని వారికి ఈ రివర్స్ మోర్టగేజ్ లోన్ అనేది మంచి మార్గం. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.