ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం సిబ్బందిలో 5 శాతానికి సమానమైన 11,000 మంది ఎంప్లాయీస్ను తీసేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా లాంటి బడా టెక్ కంపెనీలు లే ఆఫ్స్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తోంది. బుధవారం నుంచే ఈ సంస్థలో తొలగింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. హెచ్ఆర్, ఇంజినీరింగ్ విభాగాల్లో అధికంగా లే ఆఫ్స్ ఉండే చాన్స్ ఉందని తెలుస్తోంది.
ఆర్థిక సంక్షోభంతోపాటు వచ్చే రెండేళ్ల పాటు కంప్యూటర్ ఇండస్ట్రీ తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల హెచ్చరించిన విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాలకు తమ సంస్థ అతీతమేమీ కాదని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో డిజిటల్ కంపెనీల్లో సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన పరోక్షంగా లే ఆఫ్స్ మీద సంకేతాలిచ్చారు. ఇది నిజమని తాజా తొలగింపులతో రూఢీ అయిపోయింది. పర్సనల్ కంప్యూటర్ల ఇండస్ట్రీలో కొన్ని త్రైమాసికాల నుంచి ఏర్పడిన నిర్లిప్తత వల్లే మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ను చేపడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జులైలోనే కొంతమంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన మైక్రోసాఫ్ట్.. అక్టోబర్లోనూ దాదాపుగా వెయ్యి మందికి ఉద్వాసన పలికిందని సమాచారం. మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించడంపై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.