దేశంలో 5జీ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు ఇప్పటికే ప్రధాన నగరాల్లో 5జీ సేవలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో.. ఇప్పటివరకు ఈ రేసులో వెనకబడ్డ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్(బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే 5జీ సేవలు ప్రారంభించనుంది. రాబోయే 5 నుంచి 7 నెలల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీ.. 5జీకి అప్గ్రేడ్ అవుతుందని కేంద్ర టెలికాం, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. గురువారం జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 1.35 లక్షల బీఎస్ఎన్ఎల్ టవర్లను 5జీ టెక్నాలజీలోకి మారుస్తామని తెలిపారు.
వాస్తవానికి దేశంలో మరే ఇతర టెలికం సంస్థలకు గ్రామీణ ప్రాంతాల్లో లేని విస్తృతమైన నెట్వర్క్ బీఎస్ఎన్ఎల్కు ఉందన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్.. భారత టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ పాత్ర బలంగా, స్థిరమైనదిగానే ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీని ప్రారంభిస్తుందన్నట్లుగా సంకేతాలిచ్చారు. అలాగే.. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ వార్షిక ఫండ్ను రూ.500 కోట్ల నుంచి రూ.3,000-4,000 కోట్లకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు సంకేతాలిచ్చారు. ఈ నిధి యావత్తు భారత టెలికాం పరిశ్రమకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
కాగా, 5జీ టెస్టింగ్కు అవసరమైన ఎక్విప్మెంట్ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను బీఎస్ఎన్ఎల్ అడిగిందని, కాబట్టి సాధ్యమైనంత త్వరలోనే దేశంలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. జనవరి 2023 నుంచి సి-డాట్, బీఎస్ఎన్ఎల్ కలిసి 5జీ పైలట్ టెస్టును ప్రారంభించనున్నారు. అయితే, సరిగ్గా ఎప్పుడన్నది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. అన్ని అనుకున్నట్టు జరిగితే 2023లోనే బీఎస్ఎన్ఎల్ నుంచి 5జీ నెట్వర్క్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.
#BSNL 5G Service: Telco’s 4G To Be Upgraded To #5G In 5-7 Months, Says Ashwini Vaishnawhttps://t.co/TEVpdvEmuv
— ABP LIVE (@abplive) December 9, 2022