పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి జీవితం ఎంతో సులభతరం అయ్యింది. ముఖ్యంగా వాణిజ్యపరమైన లావాదేవీలు ఎంతో తేలిగ్గా మారిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండానే కావాల్సినవి కొనేస్తున్నారు. చెల్లింపులు అయితే ఎంతో సులభతరం అయ్యాయి. అయితే ఈ మారుతున్న టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. ముప్పులు కూడా అన్నే ఉన్నాయి. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు? ఎవరు? ఎలా కాజేస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఆన్లైన్ షాపింగ్ల పేరుతో మోసం చేసేవాళ్లు కొందరైతే.. ఇప్పుడు హ్యాకర్లు కూడా పేట్రేగిపోతున్నారు. వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసి డబ్బు కాజేస్తున్నారు. అయితే ఇప్పుడు డార్క్ వెబ్లో ఇంకో కొత్త సమస్యని కనుగొన్నారు. దాదాపు 90 లక్షల మంది ఖాతాదారుల సమాచారాన్ని డార్క్ వెబ్లో అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లౌడ్సెక్ అనే సంస్థ డార్క్ వెబ్లో ఓ విషయాన్ని గుర్తించింది. రష్యాకు చెందిన డార్క్ వెబ్సైబర్ క్రైమ్ ఫోరమ్లో 12 లక్షల మందికి చెంది కార్డుల వివరాలు ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు గుర్తించారు. అంతేకాకుండా బైడెన్ క్యాష్ అనే మరో వెబ్సైట్లో 79 లక్షల మంది కార్డుదారుల వివరాలు మాత్రమే కాకుండా.. కార్డు నంబర్, సీవీవీలను కూడా అందుబాటులో ఉంచినట్లు కనుగొన్నారు. ఒక్క కార్డు వివరాలే కాకుండా.. కార్డుకు అనుసంధానమైన వ్యక్తిగత ఇమెయిల్స్ ని కూడా విడుదల చేశారంట. ఎప్పుడు ఎవరి కార్డులో డబ్బులు పోతాయోనంటూ అంతా బిక్కు బిక్కు మంటున్నారు.
ఈ బైడెన్ క్యాష్ అనే సైట్కి ఇదేం కొత్తకాదు.. గతంలో సాఫ్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ప్రపంచ బ్యాంక్లకు అనుసంధానించిన ఎన్నో ఇమెయిల్స్ రికార్డులను లీక్ చేసింది. అమెరికన్ ఎక్స్ ప్రెస్, ఎస్బీఐ, ఫిసర్వ్ సొల్యూషన్స్ ఎల్ఎల్సీ సహా ఎన్నో అగ్రశ్రేణి బ్యాంకుల వివరాలు బహిర్గతం చేసినట్లు భద్రతా పరిశోధకులు దేశాయ్ తెలిపారు. వీసా, మాస్టర్ కార్డ్ నెట్వర్క్ లకు సంబంధించిన సుమారు 5.08 లక్షల డెబిట్ కార్డుల వివరాలు కూడా లీక్ అయినట్లు దేశాయ్ వెల్లడించారు. ఈ లీకుల వల్ల అనధికారికి, అక్రమ కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇష్టానుసారం కార్డు క్లోనింగ్ కూడా చేస్తారని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బైడెన్ క్యాష్ అనే వెబ్సైట్ తమ ట్రాఫిక్ని పెంచుకునేందుకు ఇలాంటి పనులు చేస్తుంటుందని నిపుణులు చెబుతున్నారు.