దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో హీట్ను పెంచుతున్నారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆమె చేపట్టిన పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె బస్సుకు నిప్పు పెట్టడంతో పాటు రాళ్ల దాడి కూడా చేశారు. నేపథ్యంలోనే షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా ఆమెకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అనంతరం ఆమెను విడుదల చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ మంగళవారం ఆమె నిరసనకు తెరతీశారు. పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్కు బయలుదేరారు.
నిన్న దాడిలో అద్దాలు పగిలిన కారును స్వయంగా ఆమే నడుపుకుంటూ ప్రగతి భవన్కు వెళ్లసాగారు. నిరసన కోసం వెళుతున్న ఆమెను సోమాజిగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ను కలిసి నిన్న జరిగిన దాడి గురించి తెలియజేస్తానని షర్మిల అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా… పంజాగుట్ట వద్దకు భారీ ఎత్తున పోలీసులు, వైఎస్సార్టీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో షర్మిల కారులో ఉండగానే పోలీసులు ఆమె కారును క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారంటూ షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
షర్మిల అరెస్ట్ బాధాకరం: సజ్జల రామకృష్ణారెడ్డి
ఇక, షర్మిల అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వ్యక్తిగతంగా షర్మిల అరెస్ట్ బాధాకరం. మాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆమెది వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ఆ పార్టీ తెలంగాణలో ఉంది. రాజకీయపరమైన విషయాల్లో మేము కామెంట్లు చేయటం కరెక్ట్ కాదు’’ అని స్పష్టం చేశారు.