కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ అంటూ విద్యార్థుల జీవితాలు నాశనమవుతూనే ఉన్నాయి. దాదాపుగా ఏడాదిన్నరకు పైగా కరోనాతో విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. పాఠశాలల నుంచి కాలేజీల వరకు అన్ని రకాల విద్యాసంస్థలకు తాళం పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు కాస్త చదువుకు దూరమయ్యారు. ఆన్లైన్ క్లాసులంటూ మొదలుపెట్టిన వాటితో అంతాగా ప్రయోజనం లేదంటూ ఏకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొర పెట్టుకుంటున్నారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలను మూతపెట్టి లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. దీని వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరటం లేదని మేధావులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుండటంతో కరోనా కేసులు కూడా తగ్గుతు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. దీని కారణంగానే దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ఎత్తేశాయి.
ఈ నేపథ్యంలోనే థర్డ్వేవ్ అంటూ మరో సారి చిన్నపిల్లలపై విరుచుకు పడనుందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక రోజులు గడుస్తున్న కొద్ది విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి. ఈ తరుణంలోనే ఆరోగ్య శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఇప్పట్లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని, స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవచ్చని ప్రభుత్వాలకు సూచించింది. దీంతో ప్రభుత్వ వర్గాలు కూడా ప్రత్యక్ష తరగతుల నిర్వహించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆరోగ్య శాఖ కూడా విద్యాసంస్థలను తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో తెలంగాణ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.