ప్రస్తుత కాలంలో చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. కోరుకున్న ఉద్యోగం రాలేదని.. లవ్లో ఫెయిల్ అయ్యామని, ఆర్థిక కష్టాలు, ఒత్తిడి, మానసిక సమస్యలు, అనారోగ్యం ఇలా పలు కారణాలు చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కానీ మరికొందరు ఉంటారు. చూడ్డానికి చాలా మంచిగా కనిపిస్తారు. ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు. ఆర్థిక కష్టాలుండవు. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనూహ్యంగా ఆత్మహత్య వంటి దారుమైన నిర్ణయాలు తీసుకుంటారు. కారణం మూఢ భక్తి. గతంలో ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఏపీకి చెందిన ఓ యువకుడు కూడా ఇదే మాదిరి.. మూఢ భక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
ప్రకాశం జిల్లా చాట్లమడ గ్రామానికి చెందని వెంకట పూర్ణ శేఖర్ రెడ్డికి శివుడు అంటే ప్రాణం.. పిచ్చి. తండ్రి చనిపోవడంతో.. ప్రస్తుతం అతడే కుటుంబ బాగోగులు చూసుకుంటున్నాడు. శేఖర్ రెడ్డికి సోదరి, తల్లి ఉన్నారు. చెన్నైలో ఉద్యోగం చేస్తూ.. వారిని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం చెన్నై నుంచి స్వగ్రామానికి వచ్చాడు శేఖర్ రెడ్డి. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. తనను శివయ్య పిలుస్తున్నాడంటూ.. ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి.. ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్నాడు.
ఇక సూసైడ్ నోట్లో తన చావుకి ఎవరు కారణం కాదని.. తాను పిరికివాడిని కూడా కాదని.. కానీ ఈ పాడు సమాజంలో ఉండవద్దంటూ శివయ్య తనను పిలుస్తున్నాడని సూసైడ్నోట్లో వెల్లడించాడు శేఖర్ రెడ్డి. తన తండ్రి కూడా శివయ్య దగ్గరే సేవ చేస్తున్నందున.. తాను కూడా అక్కడికే వెళ్లిపోతున్నానని తెలిపాడు. వచ్చే జన్మలో సమాజానికి మేలు చేసేందుకు అవకాశం కల్పించాలని శివయ్యను కోరుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక తన సోదరిని బంధువులంతా బాగా చూసుకోవాలని.. ఆస్తి మొత్తాన్ని చెల్లి పేరున రాసి.. మంచి కుర్రాడిని చూసి ఆమెకు వివాహం జరిపించమని కోరాడు.
ఇక ఇన్ని జాగ్రత్తలు చెబుతున్న తనకు.. మరొకరు చెప్పాల్సిన అవసరం లేదని.. కేవలం శివయ్య పిలుపు రావడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు శేఖర్ రెడ్డి. చెట్టంత ఎదిగి.. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో.. అతడి తల్లి గుండెలవిసేలా ఏడుస్తోంది. శివయ్య కోసం కుటుంబాన్ని అన్యాయం చేశాడని వాపోతున్నారు బంధువులు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.