మల్టీ టాస్కింగ్.. అంటే ఒకే సమయంలో రకరకాల పనులు చక్కబెట్టడం. ఈ విద్యలో ఆరితేరిన వారు మహిళలు.. మరీ ముఖ్యంగా తల్లులు. ఓ వైపు పిల్లలను చూసుకుంటూనే.. ఇంటిని చక్కబెట్టుకుంటూ.. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రాంతం మారినా సరే.. తల్లి పాత్ర మాత్రం మారదు. ఇంట్లో అందరి కంటే ముందుగా లేచి.. చివరగా నిద్ర పోయేది తనే. ఒక్కరోజు అమ్మ తన పనులకు రెస్ట్ ఇస్తే.. ఇక ఆ ఇల్లు కిష్కిందలా మారుతుంది. నూటికో కోటికో ఎక్కడో ఓ చోట కొందరు మగాళ్లు మాత్రమే.. భార్యకు బాగాలేకపోతే.. ఇంటి పనులు చూసుకుంటారు. కానీ చాలా ఇళ్లల్లో మాత్రం.. ఆరోగ్యం బాగాలేకున్నా సరే.. ఆడవాళ్లు లేచి ఇంట్లో వాళ్ల బాగోగులు చూసుకోవాల్సిందే. ఇక నేటి కాలం మహిళలయితో ఇంటి పనులతో పాటు ఉద్యోగాలు చేస్తూ.. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు చిన్నవాళ్లు అయి.. వారిని చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేకపోతే.. పిల్లలను కూడా తీసుకుని వెళ్లి పనులు చేసుకునే తల్లులు కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మ తన పసిబిడ్డను ఛాతికి కట్టుకుని.. ఆటో నడుపుతూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వివరాలు..
నోయిడాకు చెందిన చంచల్ శర్మ (27) అనే మహిళ.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. చంచల్కు ఏడాది వయసున్న కొడుకున్నాడు. బాబుని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో.. ఆటోలో తనతో పాటు తన ఏడాది కొడుకుని కూడా తీసుకెళ్తుంది. బాబుని ఛాతికి కట్టుకుని కూర్చొబెట్టుకుని.. ఆటో నడుపుతూ.. జీవిత ప్రయాణం చేస్తుంది. చంచల్లకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆమె భర్త. కొన్నాళ్ల క్రితం చంచల్ భర్త ఆమెను వదిలేసి వెళ్లాడు. చేతిలో చంటి బిడ్డతో ఒంటరిగా మారింది చంచల్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలో తనకు వచ్చిన డ్రైవింగ్నే జీవానాధారం చేసుకుంది.
డ్రైవింగ రావడంతో.. ఆటో నడపాలని నిర్ణయించుకుంది చంచల్. చాలా మంది ఆమె ఆటో నడపడాన్ని ఇష్టపడలేదు. అంతేకాక తోటి డ్రైవర్లు ఆమెను అడ్డుకున్నారు. కానీ చంచల్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా లోన్ తీసుకుని.. ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుంది. ఎన్నో ఇబ్బందులను దాటుకుని.. ఆటో డ్రైవర్గా రాణిస్తోంది చంచల్. ఇక ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకే ఆమె ఆటోని రోడ్డెక్కిస్తుంది. ప్రస్తుతానికి.. ఆ రూట్లో ఉన్న ఏకైక మహిళా ఆటో డ్రైవర్ చంచల్ మాత్రమే. మహిళా ప్రయాణికులు ఆమె ఆటోను ఎక్కేందుకు ఇష్టపడతారు.
ఈ సందర్భంగా చంచల్ మాట్లాడుతూ.. “నా ఆటో ఎక్కే ప్రయాణికులు నన్ను ప్రశంసిస్తార. మహిళా ప్రయాణికులు నా ఆటోలో ప్రయాణం చేయడానికి చాలా ఇష్టపడతారు” అని చెప్పుకొచ్చింది. చంచల్కి తల్లి, సోదరుడు ఉన్నారు. అయితే ఏదో ఓ పని చేయకపోతే కుటుంబం గడవదు. అందుకే చంచల్ తల్లి కూరగాయలు అమ్ముతుంది. ఆమె సోదరుడు బయట పనికి వెళ్తాడు. దాంతో ఏడాది వయసున్న చంచల్ కొడుకును చూసుకునేందుకు ఇంట్లో ఎవరూ ఉండరు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను తనతో తీసుకెళ్తున్నాని చెప్పింది చంచల్. పిల్లాడిని చాతికి కట్టుకుని.. ఆటో నడుపుతుంది.
ఆటో నడపడం ద్వారా.. రోజుకు రూ.600 నుంచి రూ.700 సంపాదిస్తుంది చంచల్. అలా సంపాదించిన డబ్బులో రూ.300లు తను ఈ రిక్షా కొనుక్కునేందుకు లోన్ ఇచ్చిన ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది. పని పట్ల, తన కొడుకు పట్ల ఆ అమ్మ అంకితభావానికి నోయిడా ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఇక చంచల్ కథ తెలుసుకున్న నెటిజన్లు కూడా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.