ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండగ సందర్భంగా బంధువుల ఇంటికి రామచంద్రారెడ్డి వెళ్తుండగా కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన వాహనశ్రేణిలోని ఓ కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారని సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులందూరు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారింటికి వెళ్తున్నారు. ఈక్రమంలో మార్గం మధ్యలో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లే రింగ్ రోడ్డు వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న ఓ కారు మిథున్ రెడ్డికి చెందిన కారును బలంగా ఢీ కొట్టింది ఈ క్రమంలో ఢీ కొన్న కారు పల్టీలు కొట్టి కిందపడిపోయింది. ప్రమాద సమయంలో ఆ కారులో మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాద సమయంలో మిథున్ రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి కారులో ఉండటంతో వారికి తృటిలో ప్రమాదం తప్పింది. అయితే మిథున్ రెడ్డి కారులో ప్రయాణిస్తున్న ఆయన వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.