తెలుగులోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ షోకు ఆ తర్వాత తర్వాత ఆదరణ తగ్గుతుంది. మొదటి రెండు సీజన్ల వరకు ఈ షో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఆ తర్వాత క్రమంగా ఆదరణ కోల్పోతుంది. తాజాగా సీజన్ 6 నడుస్తోంది. గత ఐదు సీజన్ల కంటే ఈ సారి దారుణంగా ఉంది షో. టీఆర్పీ రేటింగ్ రోజురోజుకు పడిపోతుంది. ఆ విషయం పక్కన పెడితే ఈ షోపై మొదటి నుంచి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సీపీఐ నారాయణ అయితే ఏకంగా బిగ్ బాస్ హౌస్ని బ్రోతల్ హౌస్తో పోల్చాడు.. నాగార్జున మీద కూడా సెటైర్లు వేశాడు. ఇక బిగ్ బాస్ షో మీద ఏపీ హైకోర్టులో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. తాజా విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. షోలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం రెండు ఎపిసోడ్లు చూస్తామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఆ వివరాలు..
నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి బిగ్బాస్ షోపై వేసిన పిటిషన్పై మంగళవారం లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని.. షోలో పాల్గొనే మహిళలకు ప్రెగ్నెన్సీ టెస్ట్లు చేస్తున్నారని ఈ సందర్భంగా లాయర్ కోర్టుకు తెలిపాడు. అంతేకాకుండా ఇలాంటి షోలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలి. కానీ నిబంధనలకు విరుద్దంగా రాత్రి 9 గంటల నుంచే ప్రసారం చేస్తున్నారని.. దీని మీద సెన్సార్ బోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవడం కోర్టుకు తెలిపారు.
పిటిషన్దారు తరుఫు వాదనలు విన్న.. ధర్మాసనం.. ఇటీవల నిర్వాహకులే ప్రచారం కోసం వివాదాలు సృష్టించుకుంటున్నారని.. అందులో భాగంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారా అని ప్రశ్నించింది. ఈ కేసును పరిష్కరించడానికి ముందు తాము బిగ్ బాస్ రెండు ఎపిసోడ్లు చూస్తామని ధర్మాసనం చెప్పింది. అప్పుడే తమకు కొంత అవగాహన వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. తాము ప్రచారం కోసం పిల్ వేయలేదని.. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఈ సందర్భంగా పిటిషన్దారు తరఫు లాయర్ కోర్టును కోరారు. ప్రస్తుతం నోటీసులు ఇవ్వలేమన్న ధర్మాసనం.. ఈ షోపై వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
ఇక బిగ్ బాస్ షోలో హింస, అశ్లీలం, అసభ్యతను ప్రోత్సహించేదిగా ఉందంటూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక షో ప్రదర్శనను ఆపేయాలని కోరారు. అంతేకాదు ఈ బిగ్బాస్ షోను నిషేధించాలంటూ మరికొంతమంది రాజకీయ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సీపీఐ నేత నారాయణ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటూ పలువురు బిగ్ బాస్పై మండిపడ్డారు. ఇది రియాల్టీ షో కాదని.. బూతు షో, కుటుంబ సభ్యులతో కలిసి ఈ షో చూడలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.