ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల విషయంలో రోజు రోజుకు ముందుకు వెళుతోంది. ఏటా దాదాపు 45 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేస్తోంది. ఈ విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బయట పెట్టింది. రాజ్యసభలో ఏపీ అప్పుల గురించి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఓ ప్రశ్న వేయగా.. దానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో 2,64,451 కోట్ల రూపాయల అప్పు చేసిందని, 2020లో అది 3,07,671 కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు. అదే విధంగా 2021లో 3,53,021 కోట్ల రూపాయల అప్పు చేయగా.. 2022లో సవరించిన అంచనాలతో 3,93,718 కోట్ల రూపాయల అప్పు చేసిందని వెల్లడించారు. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఏపీ అప్పు ప్రస్తుతం 4,42,442 కోట్ల రూపాయలని ఆయన పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది దాదాపు 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తోందని వివరించారు. ఇక, ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ప్రతి రోజు దాదాపు 205 కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది. గడిచిన 9 నెలల్లో ఏపీ ప్రభుత్వం ఏకంగా 55,555 కోట్ల రూపాయల అప్పు చేసింది. గడిచిన 9 నెలల్లో ప్రభుత్వ అప్పు ఎఫ్ఆర్బీఎం పరిమితులను మించి ఉందని, అది 55,555 కోట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. మరి, ఏపీ ప్రభుత్వం ఎడా పెడా అప్పులు చేస్తోందన్న అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.