ఒక ఆలోచన వేల మెదళ్లకు ప్రేరణ.. ఒక అడుగు వేల అడుగులకు నాంది.. ఆ ఆలోచనే ఓ కలెక్టర్ మదిలో మెదిలింది. ఆ అడుగులు మహబూబాబాద్ జిల్లాలో పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా అటవి ప్రాంతం కలిగివుంది. దీంతో వర్షాకాలం వస్తే మన్యం ప్రజల కష్టాలు వర్ణాణతీతం. మరీ ముఖ్యంగా గర్భిణుల బాధలు చెప్పలేం. వర్షాకాలం వస్తే చాలు వాగులు పొంగుతాయి.. రోడ్లు తెగుతాయి.. ఊర్లన్నీ జలమయం అవుతాయి. ముఖ్యంగా ఆ ప్రాంతాలకు రవాణా స్తంభిస్తుంది. దీంతో ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు అనేకం. ఈ సారి అలా జరగకూడదనే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక ముందడుగు వేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహబూబాబాద్ జిల్లాలో 15 రోజుల్లో ప్రసవం అయ్యే గర్భిణులను దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(PHC)లకు సురక్షితంగా తరలించాలని కలెక్టర్ శశాంక ఆదేశాలు జారి చేశారు.అలా కుదరని పక్షంలో రవాణకు దగ్గరలో ఉన్న వారి బంధువుల ఇళ్లల్లోకి చేరవేయాలని సూచించారు. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా 21 పీహెచ్ సీల పరిధిలో 131మంది గర్భిణులు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. వారందరిని ఆరోగ్య కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు సురక్షితంగా తరలిస్తున్నారు. ఇప్పటికే చూట్టు పక్కల పలు మండలాల నుంచి 20 మందిని తరలించినట్లు వైద్యాధికారి డా. హరీశ్ రాజ్ తెలిపారు.
వారిని ఏఎన్ఎమ్, ఆశా కార్యకర్తల సహాయంతో 108, 102ల ద్వారా చేరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గర్భిణులతో పాటుగా కుటుంబ సభ్యులు ఒకరు ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వారికి భోజన వసతి కూడా కల్పించామని వెల్లడించారు. అమ్మతనానికి కలెక్టర్ చూపిన చొరవని కొందరు నెటిజన్స్ పొగుడుతున్నారు. మరి.. ప్రజల కోసం ఇంతలా కష్టపడుతున్న కలెక్టర్ శశాంకపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.