తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన జూనియర్ లైన్మెన్ పరీక్ష పత్రం లీక్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రశ్నపత్రం లీక్ కు విద్యుత్ శాఖ ఉద్యోగులే కారణం అంటూ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. అడ్వాన్స్ కింద ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు చేసినట్లు వెల్లడించారు.
జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి జులై 17న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రానికి దుర్గాప్రసాద్ వ్యక్తి సెల్ ఫోన్ తీసుకుని వచ్చాడు. అతనికి మైక్రో ఫోన్ ద్వారా నిందితులు సమాధానాలు చేరవేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఫిరోజ్ ఖాన్ కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. విద్యుత్ శాఖలో ఫిరోజ్ ఖాన్ ఏడీఈగా చేస్తున్నారు. అంతేకాకుండా అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ సైదులు, సబ్ ఇంజినీర్ షేక్ షాజాన్ ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు.
ఫిరోజ్ ఖాన్పై అంబర్ పేట పీఎస్ లో ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఫిరోజ్ ఖాన్ ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. కొందరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.