చదువుకి పేదరికం అడ్డంకి అవుతుందా కానే కాదు.. మనసులో చదువుకోవాలనే ఆశ బలంగా ఉంటే.. ఏ ఇబ్బంది మనల్ని ఏం చేయలేదు. కావాల్సిందిల్లా బలమైన సంకల్పం.. జీవితంలో ఎదగాలనే ఆశ. ఈ రెండు ఉన్న మనిషి ఎన్నటికి ఓడిపోడు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో తమ జీవితంలో సక్సెస్ సాధించి నిరూపించారు. అంతేకాక ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చరిత్రలో విజయం సాధించిన వారిని చూస్తే.. వారు తమ జీవితంలో ఎన్నో కష్టనష్టాలను దాటుకుని వచ్చారో తెలుస్తుంది. తాజాగా ఈ జాబితాలో నిలిచాడు ఖమ్మంకు చెందిన ఓ యువకుడు. పేదింటి బిడ్డకు గొప్ప చదువులు ఎందుకు.. ఎంత చదివినా.. మనకేమన్న పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయా ఏంటి అనే మాటలు తప్పని నిరూపిస్తూ.. అమెజాన్లాంటి అంతర్జాతీయ కంపెనీలో ఏడాదికి 64 లక్షల రూపాయల వేతనం పొందే కొలువు.. అది కూడా 21 ఏళ్లలోపే సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు..
ఖమ్మం జిల్లా, టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి ఈశ్వరాచారి-అనితాలక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు నిఖిల్ 1-5వ తరగతి వరకు మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత 6-10 టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించాడు.2015-16 సంవత్సరంలో పదో తరగతిలో 10 జీపీఏ సాధించాడు. దాంతో నిఖిల్కు బాసర ట్రిపుల్ ఐటీలో సీటు దక్కింది.
ఈ క్రమంలో బాసర ఆర్జీయూకేటీలో ఇంటర్తో పాటు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు నిఖిల్. చివరి ఏడాది చదువుతుండగానే.. క్యాంపస్ సెలక్షన్లో భాగంగా అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా ఉద్యోగం లభించింది. ఏడాది వేతనంగా 64 లక్షల రూపాయలు అందుకోనున్నాడు. స్పెయిన్ రాజధాని మాడ్రిట్లోని అమెజాన్ కంపెనీలో మరో రెండు నెలల్లో విధుల్లో చేరబోతున్నట్లు నిఖిల్ తెలిపాడు. కుమారుడు సాధించిన విజయం చూసి అతడి తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతరాత్ర కారణాలు చెప్పే వారిక నిఖిల్ఘాదర్శంగా నిలుస్తున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.