భారత దేశంలో నిరుద్యోగం యువతను వెంటాడే భయంకరమైన సమస్య. ఎంతో మంది ఉన్నత విద్యనభ్యసించి నిరుద్యోగులుగా నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. అసలే నిరుద్యోగ సమస్య యువతను వెంటాడుతుందీ అనుకుంటే.. రెండేళ్ల క్రితం మొదలైన కరోనా మహమ్మారి కారణంతో ఈ కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. ఎంతో మంది ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకొని నిరుద్యోగులుగా మారారు. కరోనా తర్వాత కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు రావాలంటే కష్టంగా మారిపోయింది.
ఇలాంటి సమయంలో కొంత మంది యువత స్వయంఉపాధిపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఐఐఎంలో ఎంబీఏ చేసి వ్యాపారం చేయాలనుకున్న ఓ యువకుడి కల నెరవేరలేదు. దాంతో ‘MBA చాయ్వాలా’ పేరుతో ఒక టీ స్టాల్ ప్రారంభించాడు. క్రమంగా ఎదుగుతూ ఈ వ్యాపారంలో రూ.కోట్లు గడించాడు. తాజాగా MBA చాయ్వాలా నుండి ప్రేరణ పొంది, తుక్తుకీ దాస్ అనే యువతి హబ్రా స్టేషన్లో తన స్వంత టీ స్టాల్ని తెరిచింది.. మంచి సాంపాదనతో ముందుకు సాగుతుంది.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి తుక్తుకీ దాస్ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించింది.. కానీ సరైన ఉద్యోగం మాత్రం సంపాదించుకోలేకపోయింది. దీంతో ఆ యువతి కొత్తగా ఆలోచించింది. తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది. పీజి చదివి ఆ పనిచేస్తావా అంటూ మొదట్లో నిరాశ పరిచారు. అయినా ఆ యువతి వెనకడుగు వేయలేదు.
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలోని హెబ్రా రైల్వే స్టేషన్ దగ్గర ఓ చిన్న షాప్ను అద్దెకు తీసుకొని టీ స్టాల్ను ఏర్పాటు చేసింది. నవంబర్ 1 వ తేదీన ఆ దుకాణాన్ని ఓపెన్ చేసింది. మొదటి రోజు అందరికీ మంచి చాయ్ అందించి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అంతేకాదు, ఆమె టీస్టాల్ పేరు ఆకట్టుకునే విధంగా ‘MA ఇంగ్లీష్ చైవాలీ’ పేరును పెట్టింది.
ఆ ఛాయ్ దుకాణం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక హెబ్రా రైల్వే స్టేషన్కు వెళ్లే వారంతా అక్కడ ఆగి ఛాయ్ తాగి వెళ్తున్నారట. ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా తన స్వశక్తితో సంపాదన మొదలు పెట్టిన ఈ యువతిని చూసి ఎంతో మంది మెచ్చుకోవడమే కాదు.. ఆదర్శంగా కూడా తీసుకుంటున్నారట. ఇక ఉద్యోగం వేటలో ఫెయిల్ అయినా సంపాదించాలనే కలను ఛాయ్ దుకాణంతో నెరవేర్చుకున్నానని చెబుతోంది తుక్తుకీదాస్.