అమరావతి- నగరి ఎమ్మెల్యే రోజా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ నేతల కంటే, సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైనే పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తన సొంత నియోజకవర్గం నగరిలో వైసీపీ పార్టీలోనే రోజా వ్యతిరేక వర్గం ఉండటం ఆమెకు తలనొప్పిగా మారింది. రోజా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆ వర్గంపై రోజా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ, సమయం చిక్కినప్పుడల్లా వైరి వర్గంపై సీఎం జగన్ కు పిర్యాదు చేస్తూనే ఉంది.
ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు రోజాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జగన్ తీసుకున్న నిర్ణయంతో రోజాకు షాక్ తగిలింది. నగరి ఎమ్మెల్యే రోజా వ్యతిరేకవర్గానికి పదవులు లభించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం దేవస్థానం పాలక మండలిని నియమించింది.
ఈ పాలక మండలిలో రోజా వ్యతిరేక వర్గంలోని నేతకు చోటు దక్కింది. శ్రీశైలం ఆలయం పాలకమండలిలో నగరికి చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ప్రభుత్వం చోటు కల్పించింది. అంతే కాదు నగరి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కేజీ కుమార్ సతీమణి శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. ఇంకేముంది రోజా వ్యతిరేక వర్గం ఆమెపై పైచేయి సాధించిందనట్లైంది. ఇదే ఇప్పుడు రోజాకు మింగుడు పడటం లేదు.
ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా అయోమయంలో పడింది. ఈ అంశానికి సంబందించి వైసీపీ పార్టీ కీలక నేతలపై ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చక్రపాణి రెడ్డికి పదవి ఇవ్వడంపై ఆమె తీవ్ర మనస్తాపం చెందినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా రోజా తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. ఐతే ఈ విషయంపై రోజా మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.