హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా లక్షణాలు కలిగినవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి తాజా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
సీఎస్ సోమేశ్ కుమార్ నిన్న రాత్రి బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిహెచ్ఎంసి ప్రాంతాలలో కోవిడ్ పై జోనల్ కమిషనర్లు మరియు జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనసర్లతో టెలి-కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణ ఆరోగ్య కేంద్రం మరియు బస్తీ దవాఖానాల్లో ఔట్ పేషెంట్ క్లినిక్ ను ప్రారంభించాలని చీఫ్ సెక్రటరీ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. కరోనా లక్షణాలు వున్న వ్యక్తులందరికీ వారికి హోం ట్రీట్ మెంట్ కిట్లను అందజేయాలని ఆయన ఆదేశించారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడం, స్వల్పంగా కరోనా లక్షణాలు కల్పిస్తే సాధారణ మందులు, హోమ్ ఐసోలేషన్తో కోలుకునే అంశాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటింటి సర్వేను ప్రారంభించి జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలున్న వారికి కరోనా కిట్లను పంపిణీ చేయడం.. సమస్య తీవ్రంగా ఉంటే కొవిడ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు ప్రారంభించారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వారికి ఆరోగ్య సలహాలు అందించేందుకు ప్రభుత్వ బస్తీ దవాఖానలు, ఆరోగ్య కేంద్రాలలో ఔట్ పేషెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. సమస్య తీవ్రతను బట్టి సర్కిల్కు ఒకటి చొప్పున కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు కూకట్పల్లి జోనల్ అధికారులు చెబుతున్నారు.